TDP: ఆ విషయంలో వారిద్దరూ జైలుకెళ్లడం ఖాయం: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ABN , Publish Date - Feb 23 , 2024 | 04:42 PM
ఇసుకాసురుడు జగన్ రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన దోపిడీకి జైలుకెళ్లడం ఖాయమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhi Ram) హెచ్చరించారు. రాష్ట్రంలోని అక్రమ ఇసుక తవ్వకాలపై కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ NGTకి ఇచ్చిన నివేదికపై జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు.
అమరావతి: ఇసుకాసురుడు జగన్ రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన దోపిడీకి జైలుకెళ్లడం ఖాయమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhi Ram) హెచ్చరించారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని అక్రమ ఇసుక తవ్వకాలపై కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ NGTకి ఇచ్చిన నివేదికపై జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. తన తొత్తు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డితో కలిసి పెద్దిరెడ్డి మీడియా ముందుకొచ్చి NGT నివేదికపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఏపీలో జరుగుతున్న ఇసుక దోపిడీని కప్పిపుచ్చుతూ గతంలో 22-08-2023న వెంకటరెడ్డి ఏకంగా NGTకే తప్పుడు సమాచారమిచ్చారని మండిపడ్డారు. తాము 110 రీచ్లను పరిశీలించామని, ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ NGTకి తప్పుడు సమాచారమిచ్చిన వెంకటరెడ్డి కూడా తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. ఇసుకాసురుడు జగన్ రెడ్డి మొత్తంగా పాల్పడిన ఇసుక లూఠీ రూ.50వేల నుంచి రూ.60వేల కోట్లని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా చెప్పింది నూటికి నూరుశాతం వాస్తవమని నేడు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఉమ్మడి కమిటీ తేల్చిచెప్పిందన్నారు. విచ్చలవిడిగా ఇసుకదోపిడీకి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు కాబట్టే తేలుకుట్టిన దొంగల్లా జగన్ రెడ్డి.. పెద్దిరెడ్డి నోరెత్తడం లేదని ధ్వజమెత్తారు. పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి వీల్లేకుండా వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడిన జగన్ రెడ్డి పేదవాడా? అని నిలదీశారు.
తన ఇసుక దోపిడీ కోసం ముఖ్యమంత్రే ఏకంగా ప్రభుత్వ అధికారులతో ఏకంగా NGTకే తప్పుడు నివేదికలు ఇప్పించే స్థాయికి వెళ్లారని ధ్వజమెత్తారు. 26-02-2021న NGT న్యూఢిల్లీ అధికారులు O.A : 360/2015ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఇచ్చిన మార్గదర్శకాల్లో ఒక్కటీ పాటించలేదని అన్నారు. NGT చెప్పిన విధంగా లీజు కాలపరిమితి పూర్తయ్యేలోపు ఒక్కసారి కూడా ఒక్క ఇసుక రీచ్ను ప్రభుత్వాధికారులు సందర్శించింది లేదని అన్నారు. ఒక్కరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇసుక తవ్వకాలపై సమీక్ష చేసింది లేదు.. తప్పుచేసిన అధికారులపై చర్యలు తీసుకున్నది లేదని మండిపడ్డారు. జగన్ రెడ్డి సాగిస్తున్న ఇసుక దోపిడీని ప్రజలకు తెలియ చేయడానికి అమరావతి ప్రాంతంలోకి వెళ్లిన ఈనాడు విలేకరిపై వైసీపీ గూండాలు దాడి చేశారని విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల దోపిడీకి సహకరించిన చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు, కలెక్టర్లు, మైనింగ్ శాఖ అధికారులు తమ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని కొమ్మారెడ్డి పట్టాభి రామ్ మందలించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...