YS Sharmila: కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల
ABN , Publish Date - Nov 02 , 2024 | 04:08 PM
Andhrapradesh: మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గప్పాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్... విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోందని మండిపడ్డారు. “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఎద్దేవా చేశారు.
విజయవాడ, నవంబర్ 2: కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) స్పందిస్తూ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గప్పాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్... విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోందని మండిపడ్డారు. “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి అంటూ ఎద్దేవా చేశారు.
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సలహాలకు ఎంత తీసుకుంటారో తెలుసా..
ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు ఖర్చు అవుతుంటే... ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6 వేల కోట్లు అని అన్నారు. ఇంకా రూ.3 వేల కోట్లు ప్రజలపైనే అదనపు భారం పడుతుంది కదా అని అన్నారు. దీపం - 2 కింద వెలుగులు పక్కన పెడితే.. కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్లు అంటూ వ్యాఖ్యలు చేశారు.
గత వైసీపీ చేసిన పాపమే ఇదని.. ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది ఏపీఈఆర్సీ తప్ప.. మేము కాదంటూ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరోటి కాదన్నారు. గత ప్రభుత్వం 9 సార్లు చార్జీలు పెంచిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని.. అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.
‘‘వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచితే.. మీరూ మొదలుపెట్టారు కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీకు వాళ్లకు ఏంటి తేడా ? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే.. మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు కదా. మీకు వాళ్లకు ఏంటి తేడా’’ అని ప్రశ్నించారు. రూ.6 వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా… సాయం తీసుకురావాలన్నారు. ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5 న @INC_Andhra కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Ayyanna: కోడెల విగ్రహం తొలగింపు బాధాకరం
CM Chandrababu: గుంతలు లేని రోడ్లే మా ధ్యేయం
Read Latest AP News And Telugu News