Share News

Pawan Kalyan: చేనేత కార్మికుడి కుటుంబం ఆత్మహత్య పట్ల పలు అనుమానాలు

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:37 PM

అమరావతి: ఒంటిమిట్ట మండలంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య పట్ల పలు సందేహాలు కలుగుతున్నాయని.. వైసీపీ నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ..

Pawan Kalyan: చేనేత కార్మికుడి కుటుంబం ఆత్మహత్య పట్ల పలు అనుమానాలు

అమరావతి: ఒంటిమిట్ట మండలంలో చేనేత కార్మికుడు (Handloom worker) సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య (Subbarao Family) పట్ల పలు సందేహాలు కలుగుతున్నాయని.. వైసీపీ నాయకులు (YCP Leaders) చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారని జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. చేనేత కార్మికుడి కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేశారని మండిపడ్డారు. ఆ కుటుంబానికి చెందిన ఆస్తి వైసీపీ నాయకుల పేరు మీదకు ఎలా మారిపోయిందని ప్రశ్నించారు. సామూహిక మరణాలకు కారకులెవరో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలకులు ప్రజల ఆస్తులు హస్తగతం చేసుకొనేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చిందని విమర్శించారు. అంతే కాదు ఆస్తుల రిజిస్ట్రేషన్ తరవాత కనీసం దస్తావేజులు కూడా ఇవ్వకుండా కేవలం ఫోటోస్టాట్ కాపీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం కూడా వైసీపీ భూదందా కుట్రలో భాగమే అనిపిస్తోందన్నారు. అధికార పదవుల్లోని ముఖ్య నాయకులు భారీగా దోచేస్తుంటే స్థానికంగా ఉన్న నాయకులు పేదల భూములు గుంజేస్తున్నారని, వాటిని చట్టపరంగా చేసేందుకే చట్ట సవరణలు, కొత్త చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంతోపాటు.. భూ దందాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితే కానీ గడవని నిరుపేద చేనేత కుటుంబం. మరోవైపు కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు భారమయ్యాయి. తండ్రి పేరిట ఉన్న మూడెకరాల పొలం అమ్మి అప్పులు తీర్చేద్దామని ప్రయత్నిస్తే.. ఆ భూమిని అధికార పార్టీ నేత ఒకరు రెవెన్యూ అధికారుల సాయంతో తన బంధువు పేరిట ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. భూమిని తమ పేరిట మార్చాలని వేడుకున్నా అధికారులు స్పందించలేదు. వైసీపీ నేత భూదాహానికి, రెవెన్యూ అధికారుల అడ్డగోలు వ్యవహారాలకు ఆ కుటుంబం బలైంది. అప్పులు తీర్చే మార్గం లేక, తీవ్ర మనోవేదనతో భర్త, భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన పాల సుబ్బారావు (47), పాల పద్మావతి (41) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హైదరాబాద్‌ లో బ్యూటీపార్లర్‌ కోర్సు చేస్తున్నారు. చిన్న కుమార్తె పాల వినయ (17) తల్లిదండ్రులతో ఉంటూ ఇంటర్‌ చదువుతున్నారు. సుబ్బారావు యాక్టింగ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, పద్మావతి టైలర్‌ వృత్తి చేస్తున్నారు. వారి స్వస్థలం బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం ఆకుతోటపల్లి. ఈ గ్రామం సోమశిల మునక ప్రాంతం కావడంతో వీరు 20 ఏళ్ల కిత్రం కొత్తమాధవరం వచ్చి స్థిరపడ్డారు.

కొద్ది రోజులుగా వీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట రెవెన్యూ పరిధిలో 2187/2 సర్వే నంబరులో తన తండ్రి పేరుతో ఉన్న 3.10 ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం చేశారు. అయితే ఆ భూమి కట్టా శ్రావణి పేరు మీద ఆన్‌లైన్‌లో ఉన్నట్టు తెలిసింది. ఆమె రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి ప్రధాన అనుచరుడైన ఓ మాజీ సర్పంచ్‌కు దగ్గర బంధువు. తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, కుమార్తెల కోసం ఆ పొలాన్ని ఉంచుకున్నామని, ఎలాగైనా తన పేరుతో ఆ పొలాన్ని మార్చాలని పలుమార్లు సుబ్బారావు రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. వారు స్పందించకపోవడంతో ఆయన తీవ్రమనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తల్లీబిడ్డ పద్మావతి, వినయ ఇంట్లో ఉరేసుకోగా.. సుబ్బారావు ఒంటిమిట్ట సమీపంలో రైలుకింద పడి చనిపోయారు. ఆయన మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ లభించింది. ‘మా నాన్న పేరుతో ఉన్న 3.10 ఎకరాల భూమిని కట్టా శ్రావణి పేరుతో ఆన్‌లైన్‌ చేశారు. మా నాన్నకు కొవిడ్‌ రావడంతో రూ.4లక్షలు అప్పు చేసి వైద్యం చేయించాం. తమ్ముడి పెళ్లికి రూ.3 లక్షలు అప్పు చేశాం. మా పొలం కూడా మా పేరుమీద లేకపోవడంతో వేరే మార్గం లేక ఆత్మ చేసుకుంటున్నాం. లంచాలు మరిగిన రెవెన్యూ అధికారులకు శిక్షపడాలి’ అని సుబ్బారావు రాసిన సూసైడ్‌ నోట్‌లో ఉంది. ఘటనా స్థలాన్ని కడప డీఎస్పీ షరీఫ్‌, సీఐ పురుషోత్తంరాజు పరిశీలించి విచారణ చేపట్టారు.

సర్కార్‌ దాష్టీకానికి బలి: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ దాష్టీకానికి చేనేత కుటుంబం బలైందని, రెవెన్యూ సిబ్బంది ద్వారా వైసీపీ నాయకులు చేసిన అధికారిక కబ్జా నిండు కుటుంబం ఉసురుతీసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డుల్లో పేర్లు మార్చిన వైసీపీ భూబకాసురులతో పోరాడలేక పేద బీసీ కుటుంబం బలవంతంగా ప్రాణాలు తీసుకుందని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘ఈ దారుణంపై ఏం సమాధానం చెప్తావు జగన్‌’ అని ప్రశ్నించారు. సొంతజిల్లాలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనపై జగన్‌ తక్షణమే స్పందించాలని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవి ప్రభుత్వ హత్యలే: లోకేశ్‌

తమ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేయడంతో చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని, ఇది ముమ్మాటికీ జగన్‌ సర్కార్‌ చేసిన హత్యేనని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. పాల సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం తనను తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందని విచారం వ్యక్తం చేశారు. మృతులకు ‘ఎక్స్‌’ వేదికగా నివాళులర్పించారు. చేనేత కుటుంబం మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ ల్యాండ్‌ టైటలింగ్‌ చట్టం పేరుతో ప్రజల స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్‌ కుట్ర చేస్తున్నారని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహనరాజు ఆరోపించారు.

మృతిపై అనుమానాలు

పాల సుబ్బారావు, ఆయన భార్య, కుమార్తె మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలోనే రైలు పట్టాలు ఉన్నాయని, 3 కిలోమీటర్ల దూరం వెళ్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని అంటున్నారు. వీరికున్న మూడెకరాల పొలం పక్కనే ఇప్పుడు ఫోర్‌లేన్‌ రోడ్డు వెళుతోంది. ఆ భూమి దాదాపు రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. ఆ మూడెకరాలకు అటు ఇటు ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు రెవెన్యూ వారితో కుమ్మక్కై బినామీ పేర్లతో పట్టా చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు కుటుంబంలో ముగ్గురూ చనిపోవడంతో ఇవి హత్యలేమో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 01:40 PM