Share News

AP Politics: ఎన్నికలముందు ఎంత ప్రేమో!

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:56 AM

20 కార్పొరేషన్లు ఉన్నాయి. ఐదేళ్లుగా వాటికి సంబంధించిన పెండింగ్‌ బిల్లుల గురించి పట్టించుకోనే లేదు. ఇప్పుడు...

AP Politics: ఎన్నికలముందు ఎంత ప్రేమో!
YS Jagan

  • లోకేశ్‌ బరిలో ఉన్న మంగళగిరిపై ప్రత్యేక శ్రద్ధ

  • అక్కడ ‘పూర్తి కాబోయే’ పనులకూ ఇప్పుడే నిధులు

  • జగన్‌, బుగ్గన, అవినాశ్‌ నియోజకవర్గాలకూ..

  • కిమ్మనకుండా నిధులు ఇచ్చేసిన ఆర్థిక శాఖ

  • కోడ్‌ వచ్చిన రోజునే 13 ప్రతిపాదనలకు ఓకే

  • 23వ తేదీన వరుస జీవోలు విడుదల

  • స్ర్కీనింగ్‌ కమిటీ ఆమోదం తీసుకున్నారా? లేదా?

(అమరావతి- ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 108 మునిసిపాలిటీలు, 20 కార్పొరేషన్లు ఉన్నాయి. ఐదేళ్లుగా వాటికి సంబంధించిన పెండింగ్‌ బిల్లుల గురించి పట్టించుకోనే లేదు. ఇప్పుడు... ఒక్కసారిగా నిధుల వరద పారిస్తున్నారు. అదికూడా... ‘ఎంపిక’ చేసిన కొన్ని నియోజకవర్గాల పరిధిలోని మునిసిపాలిటీలకు మాత్రమే! ఇందులోనూ రాజకీయ కోణమే! టీడీపీ యువ నేత లోకేశ్‌ బరిలో ఉన్న మంగళగిరిపై మరింత ప్రత్యేక ప్రేమ కనబరిచారు. ఇక్కడ ఇంకా పూర్తికాని పనులకు కూడా నిధులు విడుదల చేస్తూ జీవో నెంబర్‌ 345 జారీ చేశారు. పూర్తికాని పనులకు బిల్లులను చెల్లించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. అలాగే, సీఎం జగన్‌ నియోజకవర్గం పులివెందులకు, ఎంపీ అవినాష్‌ రెడ్డి నియోజకవర్గం కడప, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి నియోజకవర్గం డోన్‌ మున్సిపాలిటీలకు బిల్లులు విడుదల చేస్తూ సంబంధిత పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీవోలు ఇచ్చారు. ఇవికాకుండా... కనిగిరి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు కూడా నిధులు ఇచ్చేశారు. పైగా... ఇవన్నీ అదనపు నిధులు కావడం గమనార్హం. బడ్జెట్లో కేటాయించిన పరిమితి దాటిపోయినప్పటికీ డబ్బులు ఇచ్చేశారు.

పట్టణ ఓటర్ల కోసం...: పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే చకచకా నిధులు జారీ చేస్తున్నారనే అనుమానాలున్నాయి. ఈ 13 జీవోల్లో అధికంగా వాటర్‌ ట్యాంకర్ల పెండింగ్‌ బిల్లుల చెల్లింపులే ఎక్కువగా ఉన్నాయి. ఇక... నర్సీపట్నంలో ఎలక్ర్టిక్‌ పోల్స్‌ తరలింపునకు రూ.16 కోట్లు ఇచ్చారు. కనిగిరిలో వాటర్‌ ట్యాంకర్ల పెండింగ్‌ బిల్లులు ఇస్తున్నట్లు రాశారు. పులివెందుల మునిసిపాలిటీలో నీటిసరఫరా కోసం రూ.15 కోట్లు ఇచ్చారు. కడపలో పూర్తయిన పనుల కోసం రూ.5 కోట్లు ఇచ్చారు.

స్ర్కీనింగ్‌ కమిటీ ఆమోదం ఉందా?

పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ఈ జీవోల ప్రతిపాదనలను స్ర్కీనింగ్‌ కమిటీకి పంపిందా? లేదా? ఎందుకంటే.. కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏ ప్రతిపాదనకైనా కమిటీ ఆమోదం ఉండాలి. కానీ, ఈ ఫైళ్లు నేరుగా సీఎస్‌ నుంచి ఆర్థిక శాఖకు వెళ్తున్నాయని సమాచారం. కమిటీలో సభ్యులైన జీఏడీ సెక్రటరీ దృష్టికి వెళ్లడం లేదని తెలుస్తోంది. మార్చి 16వ తేదీ నుంచి ఆర్థిక శాఖ ‘ఫిఫో’ నిబంధన ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లిస్తుంటే ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోంది? ఆర్థిక శాఖ కేవలం ఒక్క రోజులో 13 ప్రతిపాదనలకు ఓకే చెప్పడం అత్యంత అసాధారణం. దీనిపై ఎన్నికల కమిషన్‌ విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా, కేవలం ఒక్క పార్టీకి మేలు చేసేలా ఖజానా నుంచి డబ్బులు పందేరం చేయడం కోడ్‌ను ఉల్లంఘించడమే!

ప్రకాశం జిల్లా కనిగిరిలో నీటి సరఫరా ట్యాంకర్ల బిల్లులను ఆగమేఘాల మీద చెల్లించారు. కోర్టు కంటెంప్ట్‌ కేసు ఉండటమే దీనికి కారణమట! ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రావత్‌, సత్యనారాయణ అనేక సార్లు పెండింగ్‌ బిల్లుల కంటెంప్ట్‌ కేసుల్లో హైకోర్టు ముందు నిలబడి సంజాయిషీ ఇచ్చుకొన్నారు. వాటి బిల్లులు మాత్రం చెల్లించలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్‌ బిల్లులు దాదాపు రూ.2 లక్షల కోట్లున్నాయి. పెండింగ్‌ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాదాపు 4 లక్షల పిటిషన్లు కోర్టుల్లో దాఖలయ్యాయి. ఇవి కాకుండా ప్రస్తుతం సీఎ్‌ఫఎంఎ్‌సలో దాదాపు పెండింగ్‌ బిల్లులు రూ.50,000 కోట్లకుపైగా ఉన్నాయి. ఇవేవీ పట్టని సర్కారు కేవలం రాజకీయ కోణంలో కొన్ని మునిసిపాలిటీలకు సంబంధించిన బిల్లులే చెల్లించింది.

కోడ్‌ రోజున ఆమోదం...

ఈనెల 23, 24 తేదీల్లో దాదాపు రూ.1000 కోట్ల చెల్లింపులు చేస్తూ మొత్తం 13 జీవోలిచ్చారు. అయితే, ఈ ప్రతిపాదనలను కోడ్‌ అమల్లోకి వచ్చిన రోజునే, అంటే మార్చి 16వ తేదీనే ఆమోదించింది. ఎలాంటి కొర్రీలు వేయకుండా, పూర్తికాని పనులకు బిల్లులేంటి అని అడగకుండా, కేవలం ఈ మునిసిపాలిటీలకే ఎందుకు అని ప్రశ్నించకుండా ఒకే ఒక్కరోజులో 13 ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఎలా ఆమోదించిందన్నదే ప్రశ్న! ఇలా మార్చి 16వ తేదీన ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ప్రతిపాదనలు ఇంకో 20 ఉన్నాయని సమాచారం. ఈ ప్రతిపాదనలను పాత తేదీలతో కొత్తగా ఆమోదించారనే అనుమానాలూ ఉన్నాయి. జీవోల వెబ్‌సైట్‌ను జగన్‌ సర్కారు మూసేయడంతో అసలు తేదీ తెలిసే అవకాశమే లేదు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. గత 10 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా పథకాలకు సంబంఽధించిన నిధులు వచ్చాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మ్యాచింగ్‌ గ్రాంట్‌ కలిపి సింగిల్‌ నోడల్‌ అకౌంట్లకు బదిలీ చేయాలి. కానీ, వాటిని ఖజానాలోనే ఉంచి ఇలా కావాల్సిన చోట బిల్లుల పందేరాలకు వాడుతున్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 07:06 AM