AP Politics: జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటింది: యనమల రామకృష్ణుడు
ABN , Publish Date - Feb 06 , 2024 | 10:37 PM
జగన్ ప్రభుత్వ ఆర్ధిక అరాచకత్వం హద్దులు దాటిందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైఎస్ జగన్ తన అసమర్థ, అస్తవ్యస్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు వల్లించారని అన్నారు.
అమరావతి: జగన్ ప్రభుత్వ ఆర్ధిక అరాచకత్వం హద్దులు దాటిందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన అసమర్థ, అస్తవ్యస్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు వల్లించారని అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై బాంబే స్టాక్ : ఎక్సైంజ్ అప్పులపై వివరణ కోరినా ప్రభుత్వం స్పందించలేదని కాగ్ తేల్చిందన్నారు. ఆదాయం కంటే చేస్తున్న అప్పులే అధికంగా ఉన్నాయని కాగ్ పేర్కొందన్నారు.ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అధ్వాన్నంగా ఉందని కాగ్ ఎండగట్టిందని తెలిపారు.
ఆస్తులు సృష్టించకుండా రెవెన్యూ ఖర్చులకు వినియోగిస్తున్నారని కాగ్ తప్పుపట్టింది వాస్తవం కాదా.? అని ప్రశ్నించారు. రహస్య అప్పులతో ప్రమాదమని హెచ్చరించినా లెక్కచేయలేదన్నారు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఖర్చు చేసినా సకాలంలో బిల్లులు రాక అప్పులను తీర్చలేక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలోని 4 శాతం ద్రవ్య లోటు నుంచి 9.6 శాతానికి పెరగడం జగన్ సాధించిన ఘనత అని తెలిపారు. జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం 3 దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.