AP Politics:కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ.. ఎందుకంటే..!
ABN , Publish Date - Feb 01 , 2024 | 08:51 PM
కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) గురువారం నాడు లేఖ రాశారు. ఓటర్ల తుది జాబితా తప్పులపై మూడు లేఖలు రాశారు. వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాల క్లిప్పింగులను లేఖలకు జత చేశారు.
![AP Politics:కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ.. ఎందుకంటే..!](https://media.andhrajyothy.com/media/2023/20231205/Varla_Ramaiah_4476b87b46.jpg)
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) గురువారం నాడు లేఖ రాశారు. ఓటర్ల తుది జాబితా తప్పులపై మూడు లేఖలు రాశారు. వివిధ న్యూస్ పేపర్లలో ప్రచురితమైన వార్తా కథనాల క్లిప్పింగులను లేఖలకు జత చేశారు. నెల్లూరు, మైలవరం, చిత్తూరు, ఎచ్చెర్ల, చంద్రగిరి, పొన్నూరు, విజయవాడ తూర్పు, పలమనేరు, పాణ్యం, విశాఖపట్నం, నర్సారావుపేట, పెద్దాపురం, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తప్పులను సరిదిద్దాలని కోరారు. నెల్లూరులో 17 ఏళ్ల బాలుడికి ఓటు హక్కు ఎలా కల్పించారని ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గంలో వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించలేదన్నారు. చిత్తూరు, పులిచర్లలో చనిపోయిన వారి ఓట్లను కూడా జాబితా నుంచి తొలగించలేదన్నారు.
పలమనేరులో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించారని చెప్పారు. పుత్తూరులో కేవలం ‘ఛ’ అనే అక్షరానికి ఓటు హక్కు కల్పించడం విస్మయానికి గురిచేసిందన్నారు. పుంగనూరులో మృతులకు సైతం ఓటు హక్కు కల్పించారని తెలిపారు. ఎచ్చెర్లలో కేవలం ఒకే భవనంలో 250 మంది నివాసం ఉంటున్నట్లు ఓటు హక్కు కల్పించారని అన్నారు. చంద్రగిరిలో పోలింగ్ స్టేషన్ 322లో దాదాపు 44 మంది ఓట్లను గుర్తించడమే కష్టంగా ఉందన్నారు. వివిధ నియోజకవర్గాలలో గుర్తించలేని అనేక ఓట్లు తుది జాబితాలో దర్శనమిస్తున్నాయని వర్ల రామయ్య లేఖలో తెలిపారు.