Share News

Chinta Mohan: ఏపీ రాజధాని విషయంలో బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందేమో?

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:05 AM

Andhrapradesh: బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని నాడు రాశారని.. ఆనాడు తిరుపతి రాజధాని అంటే కాదని కర్నూలుకు, హైదరాబాద్‌కు మార్చారని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.

Chinta Mohan: ఏపీ రాజధాని విషయంలో బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందేమో?

విజయవాడ, ఫిబ్రవరి 15: బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని నాడు రాశారని.. ఆనాడు తిరుపతి రాజధాని అంటే కాదని కర్నూలుకు, హైదరాబాద్‌కు మార్చారని మాజీ ఎంపీ చింతామోహన్ (Former MP Chinta Mohan) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో చదువుకున్న చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి రాజధాని అన్నారన్నారు. విశాఖలో భూములు లాక్కునేందుకు జగన్ (CM Jagan Reddy) అక్కడ రాజధాని అని అన్నారని మండిపడ్డారు. వీళ్లిద్దరూ రాయలసీమ ద్రోహులని.. తిరుపతి రాజధాని వద్దని వీరు ప్రకటించగలరా అని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా హైదరాబాదే మళ్లీ రాజధాని అని పలుకుతున్నారన్నారు. పరిణామాలు చూస్తే.. మళ్లీ తిరుపతి రాజధానిగా మారుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రజలందరూ తిరుపతి రాజధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. రాయలసీమలో ఎప్పుడు కరవు, కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తాయన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే.. తిరుపతి రాజధాని కావాలని డిమాండ్ చేశారు.

అందుకే తిరుపతిని రాజధాని చేయాలి...

హైదరాబాద్ కూడా రాజధాని అయ్యాకే అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలకు మాత్రం కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని.. అందుకే తిరుపతి రాజధాని చేయాలన్నారు. తిరుపతి రాజధాని అనేందుకు సహేతుకమైన కారణాలు తాను చూపించానన్నారు. ఇది తప్పు అని ఎవరైనా చెప్పగలరా?, కాదలగలరా? అని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన అమరావతి రైతులపై తమకు సానుభూతి ఉందన్నారు. తిరుపతి రాజధాని చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రం మొత్తం పర్యటిస్తానన్నారు. తిరుపతిలో లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని.. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నిర్మాణాలు చేయవచ్చన్నారు. ఏపీలో రాజకీయాలు చాలా నీచంగా తయారయ్యాయన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రావాలని అన్ని వర్గాల వారు నేడు కోరుకుంటున్నారని తెలిపారు.


ఏపీలో మహిళ సీఎం కాకూడదా?

జగన్ పాలన చాలా అధ్వానంగా తయారైందని.. పది సీట్లకే పరిమితం అవుతారని జోస్యం చెప్పారు. నేడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబును చూసి యన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. షర్మిలమ్మ (APCC Chief YS Sharmila) రాకతో కాంగ్రెస్‌లో బాగా బలం పెరిగిందన్నారు. గతంలో పత్రికలలో కాంగ్రెస్ వార్తలు వచ్చేవి కావని.. షర్మిలమ్మ వచ్చాక ప్రతిరోజూ కాంగ్రెస్ పత్రికలలో ఉంటుందన్నారు. జయలలిత లాగా.. ఏపీలో కూడా ఒక మహిళ సీఎం కాకూడదా అని ప్రశ్నించారు. షర్మిలమ్మను సీఎంగా చూడాలనే భావన ప్రజల్లో మొదలైందన్నారు. 130 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ ఘనమైన విజయం సాధించడం నిజమన్నారు. పది స్థానాల్లో జగన్ పరిమితం కాగా, రెండో స్థానంలో చంద్రబాబు ఉంటారన్నారు.

చిరంజీవిని సీఎం చేస్తాం...

మెగస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తిరుపతి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. కాపులు, బలిజలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. ఇప్పుడున్న రాజకీయాలకు చిరంజీవికి మంచి అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ తరపున తిరుపతిలో పోటీ చేస్తే చిరంజీవిని యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తానన్నారు. షర్మిలమ్మ, ఇతర పెద్ద నాయకులు ఉన్నా.. అందరినీ ఒప్పించి చిరంజీవిని సీఎంను చేస్తామని చింతా మోహన్ పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 15 , 2024 | 11:05 AM