Share News

Vijayawada: ఇదేం అరాచకం.. బందరు రోడ్డులో భయపెట్టించే సీన్..!

ABN , Publish Date - May 19 , 2024 | 09:31 AM

సీసాలో లూజు పెట్రోల్‌ పోయకపోతే రాత్రికి రాత్రికే పెట్రోల్‌ బంకును తగులబెడతామని ఒక బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యుడు బెదిరించిన వైనం శనివారం బందరు రోడ్డులో సూసర్‌మార్కెట్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద జరిగింది. బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు సీసా పట్టుకుని పెట్రోల్‌ పోయమనడం, సిబ్బంది నిరాకరించడం, వారిని బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు బెదిరించడం సీసీ కెమెరాల్లో ..

Vijayawada: ఇదేం అరాచకం.. బందరు రోడ్డులో భయపెట్టించే సీన్..!
Bandar Road

విజయవాడ, మే 19: సీసాలో లూజు పెట్రోల్‌ పోయకపోతే రాత్రికి రాత్రికే పెట్రోల్‌ బంకును తగులబెడతామని ఒక బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యుడు బెదిరించిన వైనం శనివారం బందరు రోడ్డులో సూసర్‌మార్కెట్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద జరిగింది. బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు సీసా పట్టుకుని పెట్రోల్‌ పోయమనడం, సిబ్బంది నిరాకరించడం, వారిని బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు బెదిరించడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా గవర్నర్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంకు మేనేజర్‌ వద్ద ఫిర్యాదు తీసుకుని బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యుల కోసం గాలిస్తున్నారు. తొలుత పెట్రోల్‌ బంకుకు వద్దకు వచ్చిన వ్యక్తి సీసాలో పెట్రోల్‌ పోయమని అడిగాడు, సిబ్బంది వీలుపడదని చెప్పడంతో వారితో అతను వాదులాడాడు. అంతేకాక పెట్రోల్‌ పోయకపోతే రాత్రికి రాత్రే పెట్రోల్‌ బంకును తగులబెడతామని హెచ్చరించడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.


సీఐ వెంకటరమణ బంకు వద్దకు వచ్చి సమాచారం సేకరించారు. రిపోర్టు తీసుకుని బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యుల్ని పట్టుకునేందుకు రెండు బృందాలను నియమించారు. ఇదిలా ఉండగా ఎన్నికల అనంతరం పలుచోట్ల జరుగుతున్న గొడవల దృష్ణ్యా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నివారించేందుకు లూజు పెట్రోల్‌ను పోయవద్దని, కేవలం బండ్లలోనే పోయాలని ఎన్నికల సంఘం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఉల్లంఘిస్తే బంకు అనుమతులను రద్దుతో పాటు చర్యలను తీసుకుంటామని తెలిపింది. దీంతో అన్ని పెట్రోల్‌ బంకులు లూజు పెట్రోల్‌ పోయడాన్ని నిలిపేశాయి. పెట్రోల్‌ బంకు వద్ద జరిగిన సంఘటన నేపథ్యంలో గవర్నరుపేట సీఐ వెంకటరమణ తన పరిధిలోని పెట్రోల్‌ బంకువారితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న గొడవలను దృష్టిలో పెట్టుకుని పెనుప్రమాదాలను నివారించేందుకు లూజుగా పెట్రోల్‌ పోయవద్దని, ఎవరైనా అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు నారాయణమ్మ, కృష్ణబాబు పాల్గొన్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 19 , 2024 | 09:31 AM