Share News

Dhanunjaya Reddy: ధనుంజయ్‌.. ఫటాఫట్‌ సెటిల్‌మెంట్‌!

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:57 AM

ముఖ్యమంత్రి జగన్‌కు ధనుంజయరెడ్డి కార్యదర్శి. సీఎంవోలో ఆయనే కీలకాధికారి. ప్రజాప్రతినిధులు, లేదా అధికారుల నుంచి ఏవైనా అభ్యర్థనలు వస్తే వాటి సంగతి ఏమిటో చూడాలని ముఖ్యమంత్రి.. తన కార్యదర్శికి చెబుతారు. సంబంధిత అంశంలో ఏం జరిగింది, తాజా

Dhanunjaya Reddy: ధనుంజయ్‌.. ఫటాఫట్‌ సెటిల్‌మెంట్‌!

  • ఎన్నికల హడావుడిలో భారీగా అవినీతి కేసులు ఎత్తివేత

  • రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌లో 74 మందికి క్లీన్‌చిట్‌, కొందరికి చిన్నశిక్షలు

  • ఇవన్నీ ఏసీబీ, విజిలెన్స్‌ కేసులే.. చక్రం తిప్పిన సీఎంవోలోని జగన్‌ ‘ఆత్మ’

  • కోడ్‌కు వారం ముందు సీఎంవో నుంచి శాఖలకు లేఖలు

  • హడావుడిగా ప్రతిపాదనలు పంపించిన రెవెన్యూ శాఖ

  • ఎన్నికల కోడ్‌ వచ్చాక పాత తారీఖులతో ఉత్తర్వులు

  • సిఫారసుల్లో పోటీలుపడ్డ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు

  • తీవ్ర కేసులున్నవారికి ప్రాసిక్యూషన్‌ మినహాయింపు

  • కీలకంగా వ్యవహరించిన సీసీఎల్‌ఏలోని ఆ ముగ్గురు

‘‘అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వారిని ఉపేక్షించం. కులం, మతం చూడకుండా ఎంతటి అధికారులయినా తప్పులు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. చాలా గట్టి మెసేజ్‌ వెళ్లేలా చర్యలు తీసుకోండి’’

..ముఖ్యమంత్రి జగన్‌ 2023లో ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాలకు ఇచ్చిన పిలుపు ఇది. మరి ఆ మాటలు నిజమయ్యాయా?.. లేనేలేదు.

జగన్‌ (YS Jagan Mohan Reddy) మాటలు నిజమేనని నమ్మి ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాలు 74మందిపై తమ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులపై విచారణ పూర్తిచేసి చర్యల కోసం ప్రభుత్వానికి నివేదించాయి. వీరిలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, 22 మంది తహసీల్దార్లు, 18 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 12 మంది మండల సర్వేయర్‌లు, మరో ఆరుగురు ఇతర అధికారులు ఉన్నారు. మరి వీరందరిపైనా జగన్‌ సర్కారు కొరడా ఝుళిపించిందా? అంతా ఉత్తిదే. చెప్పిన దానికి భిన్నంగా అక్రమార్కులను, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జగన్‌ ఆదేశాలతో ఆయన ‘ఆత్మ’ ధనుంజయరెడ్డి సేఫ్‌గా బయటపడేశారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి జగన్‌కు ధనుంజయరెడ్డి (Dhanunjaya Reddy) కార్యదర్శి. సీఎంవోలో ఆయనే కీలకాధికారి. ప్రజాప్రతినిధులు, లేదా అధికారుల నుంచి ఏవైనా అభ్యర్థనలు వస్తే వాటి సంగతి ఏమిటో చూడాలని ముఖ్యమంత్రి.. తన కార్యదర్శికి చెబుతారు. సంబంధిత అంశంలో ఏం జరిగింది, తాజా పరిస్థితి ఏమిటో నివేదించాలని సీఎంవో కార్యదర్శి ఆయా శాఖలకు లేఖలు రాస్తుంటారు. ఇది పద్ధతి. కానీ ధనుంజయరెడ్డి రూటే వేరు. నేరుగా సంబంధిత ఫైలును సీఎంవోకు పంపించాలని లేఖలు రాస్తున్నారు. ఈ పేరిట తనకంటే సీనియర్‌లయినా ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిస్తూ ఫైలు తెప్పించుకుంటున్నారు.

Dhanunjaya-Reddy-1.jpg

ధనుంజయరెడ్డి లేఖాస్త్రాల్లో మచ్చుకు కొన్ని...

1) ఎన్నికల కోడ్‌ రావడానికి కొద్ది రోజుల ముందు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి...సీఎంకు లేఖరాశారు. ధర్మచంద్రారెడ్డి అనే డిప్యూటీ కలెక్టర్‌పై చర్యలు తీసుకోవద్దని, అభియోగాలు ఉపసంహరించుకోవాలనేది ఆ లేఖ సారాంశం. ఆ లేఖ ఆధారంగా రెవెన్యూశాఖ నుంచి ధర్మచంద్రారెడ్డికి సంబంధించిన ఫైలు సీఎంకు పంపించాలని ధనుంజయరెడ్డి లేఖరాశారు. ఈ మేరకు రెవెన్యూశాఖ వెనువెంటనే ఫైలును సీఎంవోకు పంపించింది. ఆ తర్వాత సీఎం స్థాయిలో ఆ కేసుపై సానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ధర్మచంద్రారెడ్డి విశాఖ భీమిలీ తహసిల్దార్‌గా ఉన్న సమయంలో విలువైన భూమిని కాపాడే విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకోలేకపోయారన్న అభియోగం నిరూపితమైంది. ఆయనది స్వస్థలం కడప.

2) విశాఖకు చెందిన ఆనంద్‌కుమార్‌ అనే జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌పై 2015లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఏసీబీ అతన్ని ప్రాసిక్యూట్‌ చేయాలని కోరితే, 2018లో ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు (జీవో 574) జారీ చేసింది. ఆ ఫైలుపై ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎలాంటి కదలికలేదు. ఆనంద్‌కుమార్‌ నిజాయితీపరుడని, ఆయనపై ఉన్న ప్రాసిక్యూషన్‌ ఉత్తర్వులు ఉపసంహరించాలని కోరుతూ అధికారపార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కరణం ఽధర్మశ్రీ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణే్‌షకుమార్‌ సీఎంకు గత ఏడాది నవంబరు 8న లేఖలు రాశారు. నాలుగు నెలల పాటు స్పందించని జగన్‌ కార్యాలయం, కోడ్‌కు కొద్దిరోజుల ముందు వాటిని తెరమీదకు తీసుకొచ్చింది. ఆ ఫైలును పంపించాలని ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ పంపించారు. అంతే. సచివాలయంలోని రెవెన్యూ విభాగం ఆగమేఘాల మీద ఆ ఫైలును సీఎంవోకు పంపించింది. ప్రాసిక్యూషన్‌ ఉత్తర్వులను ఐదేళ్లపాటు అమలుచేయకుండా, తీరా ఎన్నికల సమయంలో ఈ కేసును సెటిల్‌చేయాలనుకోవడం తీవ్రమైన అంశం. ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించాలని ఎమ్మెల్యేలు కోరగానే, సంబంధిత ఫైలు పంపాలని ధనుంజయరెడ్డి రెవెన్మూ స్పెషల్‌ సీఎ్‌సను కోరడం మరో తీవ్రమైన అంశం. అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతానని జగన్‌ చెప్పిన మాటలు ఇక్కడ పనిచేయలేదు. గత సర్కారు నిర్ణయానికి విరుద్దంగా ఈ కేసును సెటిల్‌చేశారు. ఉత్తర్వులను గోప్యంగా ఉంచారు.

3) ధనుంజయరెడ్డి సీఎం కార్యదర్శి హోదాలో అనేక ఏసీబీ, విజిలెన్స్‌ కేసుల ఫైళ్లు పంపించాలంటూ రెవెన్యూశాఖకు లేఖలు రాశారు. అందులో స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌, భూ పరిపాలన అధికారులకు సంబంధించిన కేసులే ఉన్నాయి. ఆయన రాసిన వాటిల్లో ఆరు లేఖలు వెలుగుచూశాయి. ఆ కేసుల్లో ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్‌లు, సబ్‌రిజిస్ట్రార్‌లపై అభియోగాలు నిరూపితమైనవి, ఏసీబీ, విజిలెన్స్‌లు తీవ్రమైన చర్యలకు సిఫారసు చేసినవే ఉన్నాయి.

కేసుల ఎత్తివేత జాతర

సర్వేశాఖలో ఓ అధికారిపై రెండు తీవ్రమైన కేసులున్నాయి. ఒకటి అడవివరం భూముల కేసు కాగా, మరొకటి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కేసు. ఈ రెండు కేసులను సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతో రెవెన్యూశాఖ సెటిల్‌చేసింది. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వద్ద జరిగిన కోర్టులో సర్వే అధికారి పిటిషన్‌ వేశారు. తను నిజాయితీపరుడినంటూ స్వీయ ఽద్రువీకరణ ఇస్తూ, తనపై ఉన్న శిక్షలు ఎత్తివేయాలని కోరారు. అంతే, ధర్మప్రభువు ధర్మాన కేసులను ఎత్తివేయాలని సిఫారసు చేశారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదంతా కోడ్‌కు కొద్ది రోజుల ముందే జరిగింది. జీవో 282ను మాత్రం మార్చి 5న ఇచ్చినట్లుగా చూపిస్తున్నారు. ఈ జీవో బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెవెన్యూశాఖ ఇదొక్కటే కాదు.. ఇలాంటి మేళ్లు ఓ పెద్ద జాతరలా చేపట్టింది. 74 మంది అధికారులపై ఉన్న అభియోగాలకు చిన్న చిన్న శిక్షలు వేయడం లేదా నిజాయితీపరులనే సరికొత్త ముద్రవేసి, వారిపై ఉన్న కేసులు, అంతకుముందు విధించిన శిక్షలను ఉపసంహరించుకున్నారు. ఇందులో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, 22 మంది తహసిల్దార్లు, 18 మంది డిప్యూటీ తహసిల్దార్లు (డీటీ), 12 మంది మండల సర్వేయర్‌లు, మరో ఆరుగురు ఇతర అధికారులకు మేళ్లు జరిగాయి. కోడ్‌కు ముందు అంటే, మార్చి మొదటి వారంలో ఆయా కేసులపై ఫైళ్లు పంపించాలంటూ సీఎంవో నుంచి, అజయ్‌జైన్‌ కార్యాలయం నుంచి సీసీఎల్‌ఏ, సర్వే కార్యాలయాలకు లేఖలు వెళ్లాయు. ఆగమేఘాల మీద ఆ కేసులను రివ్యూచేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల స్టేట్‌మెంట్‌లు కోరుతూ నోటీసులు ఇచ్చారు. స్టేట్‌మెంట్‌లు తీసుకొని కేసులు సెటిల్‌ చే శారు. డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసిల్దార్‌గా, తహసిల్దార్‌ నుంచి డీటీగా రివర్షన్‌ పొందిన వారి శిక్షలను ఎత్తివేశారు. వారు చేసిన తప్పులే లేవంటూ పూర్తిగా కేసులను మూసివేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవన్నీ మార్చి 15లోపే విడుదలయ్యాయి.

ఐదుగురు అధికారుల మంత్రాంగం

రెవెన్యూలో ఏసీబీ, విజిలెన్స్‌ కేసులను ఉపసంహరించడం, ప్రభుత్వం ఇంతకు ముందే తప్పు చేసిన అధికారులపై విధించిన శిక్షలను తగ్గించే పనిలో ఐదుగురు అధికారులు కీలకపాత్ర పోషించారు. ఇందులో సీసీఎల్‌ఏలోనే ముగ్గురు అధికారులు ఉండగా, సచివాలయంలో మరో ఇద్దరు ఉన్నారు. సీసీఎల్‌ఏలో సుదీర్ఘకాలం విజిలెన్స్‌ విభాగం బాధ్యతలు చూసిన ఓ అధికారే ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పారని తెలిసింది. ఏ కేసును ఎలా సెటిల్‌ చేయాలో, కేసుల ఉపసంహరణ, శిక్ష తగ్గింపునకు ఎలాంటి కారణాలు చూపాల్నో ఆ అధికారే సూచించినట్లు తెలిసింది. గత పదేళ్ల కాలంలో ఇలాంటి విషయాల్లో ఆ అధికారి పండిపోయారు. దీంతో కోడ్‌కు ముందే, తీవ్రమైన కేసులు ఫైళ్లు సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి రెవెన్యూశాఖకు శరవేగంగా వెళ్లి, అక్కడ అంతే వేగంగా పరిష్కారమయ్యేలా చక్రం తిప్పారని సహచర అధికారవర్గాలే చెబుతున్నాయి. మరో సీనియర్‌ అధికారిణి పాత్రపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

Dhanunjay.jpg

ఇప్పుడే ఎందుకీ పని?

సాధారణ సమయంలో తీవ్ర అభియోగాలు, ఆరోపణలు, కేసులున్న అధికారులపై సర్కారు కరుణ చూపిస్తే వెంటనే తెలిసిపోతుంది. అక్రమార్కులకు మేలుచేశారని ప్రభుత్వ పరువు గంగపాలవుతుంది. అదే ఎన్నికల కోడ్‌కు ముందు ఓ జాతరలా కేసులన్నీ సెటిల్‌చేస్తే? ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. అంతా ఎన్నికల గోలలో ఉండిపోతారు. ఏ కేసులు ఎత్తివేశారో ఎవ్వరూ పట్టించుకోరు. ఇక ఆయా అంశాల్లో ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఎలాగూ బయటపెట్టరు. కాబట్టి మూడో మనిషికి తె లిసే అవకాశం ఉండదనే.. ఈ సమయాన్ని మేలు..కొలుపులకు వాడుకున్నారని చెబుతున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 08:28 AM