Share News

AP Politics: ఇక గులకరాళ్లే మిగిలాయి.. జగన్ షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Apr 20 , 2024 | 08:18 AM

తనపై వేయించడానికి ఇక గులకరాళ్లే మిగిలాయని సీఎం జగన్‌(YS Jagan) అన్నారు. మరో పదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద విద్యార్థులకు ఇంగ్లీషు చదువులు అందుతాయన్నారు. వచ్చే ఐదేళ్లలో సంక్షేమ పథకాలు(Govt Schemes) కొనసాగాలా? వద్దా? అనేది ప్రజలు వేసే ఓట్లపైనే ఆధారపడి ఉందన్నారు.

AP Politics: ఇక గులకరాళ్లే మిగిలాయి.. జగన్ షాకింగ్ కామెంట్స్..
YS Jagan

కాకినాడ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): తనపై వేయించడానికి ఇక గులకరాళ్లే మిగిలాయని సీఎం జగన్‌(YS Jagan) అన్నారు. మరో పదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద విద్యార్థులకు ఇంగ్లీషు చదువులు అందుతాయన్నారు. వచ్చే ఐదేళ్లలో సంక్షేమ పథకాలు(Govt Schemes) కొనసాగాలా? వద్దా? అనేది ప్రజలు వేసే ఓట్లపైనే ఆధారపడి ఉందన్నారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌ శుక్రవారం కాకినాడ అచ్చంపేటలో(Achampet) సిద్ధం సభలో ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 25 రోజులే ఉన్నాయని, సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీకి ప్రతి ఒక్కరూ ఓటువేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన ఎన్ని చెప్పినా వినొద్దని, వైసీపీకే ఓటు వేయాలని అభ్యర్థించారు.


అందరూ మంచోళ్లే.. సౌమ్యులే..

సభలో ప్రసంగం అనంతరం జగన్‌...కాకినాడ జిల్లా పరిధిలోని వైసీపీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. మంచోళ్లు, సౌమ్యులు అంటూ వారందరికీ సర్టిఫికెట్‌ ఇచ్చారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బూతుల ఎమ్మెల్యేగా పేరొందారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను గతంలో మహిళా ప్రజాప్రతినిధుల సమక్షంలో పచ్చి బూతులు మాట్లాడారు. అలాంటి బూతుల ఎమ్మెల్యేను మంచోడు, సౌమ్యుడు అంటూ జగన్‌ పొగడటంతో జనం నవ్వుకున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావును ‘పొట్టివాడేగానీ, గట్టివాడు’ అని పేర్కొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను పరిచయం చేస్తూ ఆమెకే ఓటెయ్యాలని కోరుతూ, లోకల్‌ హీరో గీత కావాలా.. సినీ హీరో కావాలా అంటూ ప్రశ్నించారు.


ఇదేం కట్టు బాబోయ్‌...

సీఎం జగన్‌ బస్సు యాత్రలో భాగంగా నుదుటిపై ఇంకా కట్టుతోనే కనిపిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 13న విజయవాడ బస్సు యాత్రలో ఉండగా జగన్‌పై గులకరాయి దాడి తగిలింది. దీనికి కట్టుకట్టించుకుని జగన్‌ మళ్లీ యాత్ర కొనసాగిస్తున్నారు. ఆరు రోజులైనా ఇంకా జగన్‌ అదే కట్టుతో కనిపిస్తుండడంపై పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో నుదుటిపై బ్యాండేజీతో జనంలోకి వెళ్లడంవల్ల సానుభూతి పెరుగుతుందనే ఉద్దేశంతోనే జగన్‌ బ్యాండేజీ తీయడం లేదనే చర్చ సాగుతోంది. మరోపక్క నుదుటిపై సీఎం ఉంచుకున్న బ్యాండేజీ తెల్లగా కనిపించడం కోసం దానిపై ఒక పారదర్శక ప్లాస్టిక్‌ కవర్‌ అతికించుకోవడం విశేషం. వాస్తవానికి బస్సు యాత్రలో భాగంగా బయటకు వస్తే చెమట, ధూళికి బ్యాండేజీ నల్లగా అయితే ప్రచారానికి, ఫొటోలకు ఇబ్బంది అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు బ్యాండేజీ తెల్లగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలపైనా సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు... ఉదయం 10.30గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం ఎస్టీ రాజాపురంనుంచి బస్సులో జగన్‌ బయలుదేరారు. రంగంపేట దాటి కాకినాడ జిల్లాలోకి ప్రవేశించారు. మార్గమధ్యలో ఏసీ బస్సులోనుంచే జనానికి అభివాదం, సైగలు మాత్రమే చేస్తూ ముందుకు సాగారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 20 , 2024 | 08:18 AM