Share News

YS Sharmila: ఇల్లు, పిల్లల్ని వదిలేసి నిస్వార్థంగా పనిచేస్తే.. నువ్వేం చేశావ్ జగనన్న?

ABN , Publish Date - Jan 25 , 2024 | 01:17 PM

Andhrapradesh: ఏపీసీసీ చీఫ్‌‌గా బాధ్యతలు చేపట్టాక తన మార్క్ చూపిస్తున్నారు వైఎస్ షర్మిల. సొంత అన్న అని కూడా చూడకుండా సీఎం జగన్‌ను ఏకిపారేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

YS Sharmila: ఇల్లు, పిల్లల్ని వదిలేసి నిస్వార్థంగా పనిచేస్తే.. నువ్వేం చేశావ్ జగనన్న?

కాకినాడ, జనవరి 25: ఏపీసీసీ చీఫ్‌‌గా బాధ్యతలు చేపట్టాక తన మార్క్ చూపిస్తున్నారు వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila). సొంత అన్న అని కూడా చూడకుండా సీఎం జగన్‌ను (CM Jaganreddy) ఏకిపారేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని విడగొట్టి రాజకీయాలు చేస్తోందంటూ బుధవారం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల గట్టి కౌంటర్ ఇచ్చారు.

వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చింది ఎవరు?.. మీరుకాదా?

‘‘కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్న. దేవుడే గుణపాఠం చెప్తారట. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే కారణం జగనన్నే. ఇవాళ వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్నే. దీనికి సాక్ష్యం దేవుడు... దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న వైపు నిలబడితే అధికారంలో వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు. ఇవాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ళ కోసం తిరిగాం. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం. వాళ్ళను గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టి ఎండనకా, వాననకా రోడ్ల మీదనే ఉన్నా. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో ‘బై బై బాబు‘ అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్యాంపెయిన్ చేశా. మిమ్మల్ని గెలిపించా. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. మంచి ముఖ్యమంత్రి అయితే చాలు.. వైఎస్సార్ పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నా. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినా ఏపీలో బీజేపీ రాజ్యం ఏలుతోంది. జగన్ ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా అడగకుండా బానిస అయ్యారు. 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా హోదా అడగలేదు. రాష్ట్రంలో ఇప్పుడు హోదా అన్న అంశమే లేదు’’ అంటూ తనదైన శైలిలో జగన్‌పై షర్మిల విరుచుకుపడ్డారు.


పోలవరం ప్రాజెక్ట్ వైఎస్సార్ డ్రీమ్ ప్రాజెక్ట్

‘‘పోలవరం ప్రాజెక్ట్ వైఎస్సార్ డ్రీమ్ ప్రాజెక్ట్. అంతకు ముందు ఏ ప్రభుత్వాలు చేయని సాహసం వైఎస్సార్ చేశారు. వైఎస్సార్ 2004 లో ముఖ్యమంత్రిగా అయిన 6 నెలల్లో ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టారు. వైఎస్సార్ హయాంలో రూ.4500 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించారు. 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 12 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం. వైఎస్సార్ మరణించిన తర్వాత... టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశాయి. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చింది. బాబు అధికారంలోకి వచ్చాక అంచనా వ్యయం రూ.30 వేల కోట్లకు పెంచాడే తప్ప ఉపయోగం లేదు’’ అని అన్నారు.

మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు .?

‘‘వైఎస్సార్ పనితీరు మీలో కన్పిస్తే మీరు వైఎస్సార్ వారసులు అవుతారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగ. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగ. వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఇది రైతు రాజ్యం కాదు.. వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదు. ఉద్యోగాలు లేవు.. నోటిఫికేషన్‌లు ఇవ్వరు. 30 వేల టీచర్ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ లేదు. వైఎస్సార్ ప్రజల మనిషి. ప్రజల మధ్యే బ్రతికాడు. ఇప్పుడు జగన్ ఒక నియంత. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు. ప్రజలకు కనపడరు.. ఎమ్మెల్యేలను కలవరు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు .? వైఎస్సార్ నష్టపోతున్న కంపెనీలను ప్రభుత్వ పరం చేయించారు. మీరు ఉన్న ఆస్తులను అమ్ముతున్నారు. వైఎస్సార్ పేరును చెడగొట్టింది మీరు.. ఎంతో మంది త్యాగాలు చేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. నా అనుకున్న వాళ్ళను అందరినీ దూరం చేశారు. వైఎస్సార్ పాలనకు జగన్ అన్న పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది’’. అని వ్యాఖ్యలు చేశారు


అన్నీ తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నా...

‘‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు సోనియా గాంధీని కలిశా. వాళ్ళు వైఎస్సార్‌పై పెట్టుకున్న ప్రేమ అభిమానాన్ని చూశా. వైఎస్సార్ ఉంటే కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారు. వైఎస్సార్ కుటుంబంలో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నేను కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్న. నాన్న నాకు నేర్పించింది ప్రజల మధ్య ఉండాలని.. నన్ను కాంగ్రెస్ ఏపీకి వెళ్ళమంటే పని చేయాలని నిర్ణయించుకున్నా. ఇక్కడ బీజేపీ చేస్తున్న తెర వెనుక రాజకీయాలను తెలుసుకున్న. ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి... నేను ఇక్కడ పని చేయాలని అనుకున్న. ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు. నా వ్యక్తిగత నిర్ణయం అయితే... 2019లోనే నిర్ణయం తీసుకున్న. ఈ నిర్ణయంతో నేను టార్గెట్ అవుతా అని తెలుసు. నన్ను ఎటాక్ చేస్తారని తెలుసు. నా కుటుంబం నిట్ట నిలువునా చీలుతుంది అని తెలుసు. అయినా నేను తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమే’’ అంటూ షర్మిల పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 25 , 2024 | 02:00 PM