Election Commission: రెండు చోట్ల ఓట్లు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ రాజీవ్ కుమార్
ABN , Publish Date - Jan 10 , 2024 | 05:45 PM
ఎవరైనా రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ హెచ్చరించారు. 2024 పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికలకు సంబందించిన మొదటి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు.
విజయవాడ: ఎవరైనా రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ హెచ్చరించారు. 2024 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మొదటి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సన్నద్ధతపై సంబంధిత భాగస్వామ్యులు అందరితో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ముందుకెళ్తున్నామని తెలిపారు.
వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని, ఓటరు జాబితాలో తొలగింపులు, చేర్పులు విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారని వివరించారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలిచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 1.99 కోట్లు, మహిళలు 2.07 కోట్లు ఉన్నారని వివరించారు. ఎస్ఎస్ఆర్ (SSR) విడుదలకు ముందు ఎక్కడైనా ఓటర్గా రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.