DAGGUBATI PRASAD : ఒక్క అవకాశం ఇవ్వండి..!
ABN , Publish Date - May 04 , 2024 | 12:25 AM
అనంతపురం అర్బన, మే 3: ఒక్క అవకాశం ఇస్తే అనంత అర్బన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో శుక్రవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు.. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది..? దగ్గుబాటి: మా ఎన్నికల ప్రచారం ప్రతి రోజు అశేష జనవాహిని మధ్య సాగుతోంది. ఏ కాలనీకి వెళ్లినా మాకు స్థానిక ప్రజల నుంచి అ...
నిత్యం అందుబాటులో ఉంటా
మీ సేవకున్నవుతా.. అభివృద్ధి చేస్తా
టీడీపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్
అనంతపురం అర్బన, మే 3: ఒక్క అవకాశం ఇస్తే అనంత అర్బన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో శుక్రవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు..
ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది..?
దగ్గుబాటి: మా ఎన్నికల ప్రచారం ప్రతి రోజు అశేష జనవాహిని మధ్య సాగుతోంది. ఏ కాలనీకి వెళ్లినా మాకు స్థానిక ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. టీడీపీతోపాటు జనసేన, బీజేపీ శ్రేణులు ప్రచారంలో సంపూర్ణంగా భాగస్వామ్యులవుతున్నాయి. ప్రజలు నన్ను తమ కుటుంబ సభ్యుడిలాగా
ఆదరిస్తున్నారు.
ఎమ్మెల్యే అభివృద్ధి చేశామంటున్నారు..
దగ్గుబాటి: అనంత అర్బనలో ఏ ప్రాంతంలో చూసినా సమస్యలు తాండవిస్తున్నాయి. డ్రైనేజీ, పారిశుధ్యం, రోడ్లు తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. మీరైనా సమస్యలను పరిష్కరించండి అని అడుగుతున్నారు. టీడీపీ హయాంలో మంజూరైన జాతీయ రహదారి తప్ప.. ఎమ్మెల్యే ఎక్కడ అభివృద్ధి పనులు చేశారో చెప్పగలరా..? గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. ఏమీ చేయకపోయినా అంతా తామే చేశామని అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు.
మేనిఫెస్టో విడుదల ప్రభావం ఉందా..?
దగ్గుబాటి: ఇప్పటికే బాబు సూపర్ సిక్స్ పథకాలు జనంలో బాగా నాటుకుపోయాయి. యువతకు ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, మహిళలకు ప్రతి నెల రూ.1500, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం.. ఇలా పథకాలన్నీ ప్రజల గుండెలకు హత్తుకుపోయాయి. ఎన్నికల మేనిఫెస్టోపై అన్నివర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా గెలుపు తథ్యం. మెజార్టీపై దృష్టి పెట్టాం.
వైసీపీ ఆగడాలను ఏ రకంగా ఎదుర్కొంటారు?
దగ్గుబాటి: ఓటమి భయంలో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారు. రెండు రోజుల క్రితం జనం చూశారు కదా..? ఏ మాత్రం సంబంధంలేని అంశంలో మా పార్టీ నాయకుడిపై అక్రమ కేసు బనాయించి, అరెస్టు చేశారు. ఎమ్మెల్యేకు డీఎస్పీ, కొందరు సీఐలు తొత్తులుగా పనిచేస్తున్నారు. వైసీపీలో చేరాలని, లేదంటే ఊరు వదిలిపెట్టి వెళ్లాలని టీడీపీ నాయకులను
బెదిరిస్తున్నారు. వారి దాడులను, కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం.
మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తారు..?
దగ్గుబాటి: ఇప్పటికే చాలా స్పష్టం చెప్పాం. అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేస్తాం. డంపింగ్ యార్డును ఇతర ప్రాంతాలకు తరలిస్తాం. సెజ్లు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఔటర్ రింగ్ రోడ్డు, పార్కులను అభివృద్ధి చేస్తాం. పేద ముస్లింలకు ఇళ్ల స్థలాల కోసం 20 ఎకరాలు కేటాయిస్తాం. పేద ముస్లింలకు రుణాలు ఇప్పించి ఆర్థికంగా సహకారం అందిస్తాం. నియోజకవర్గం ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను. అర్ధరాత్రి సమయంలోనూ నా ఇంటి తలుపు తట్టవచ్చు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాను.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....