Share News

AP Politics: జనసేనలోకి అంబటి రాయుడు..!

ABN , Publish Date - Jan 10 , 2024 | 01:33 PM

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారు. టికెట్‌పై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.

 AP Politics: జనసేనలోకి అంబటి రాయుడు..!

అమరావతి: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారట. అయితే.. టికెట్‌పై వైసీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కేవలం పది రోజుల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడతానని అంబటి రాయుడు ప్రకటించారు.

ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారంటే..!

మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించారు. రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు తనకు నచ్చాయని చెప్పారు. గత నెలలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గుంటూరు లోక్ సభ టికెట్‌ను అంబటి రాయుడు ఆశించారు. టికెట్ కేటాయింపుపై పార్టీ నుంచి హామీ లభించలేదు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. సడెన్‌గా పవన్ కల్యాణ్‌తో భేటీ కావడంతో ఆ పార్టీలో చేరతారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

జనసేనకు మేలు

అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో..ఈయన చేరికతో పార్టీకి ప్లస్ అవుతుందని జనసైనికులు భావిస్తున్నారట. ఏపీలో కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందన్నది జగమెరిగిన సత్యమే. రాయుడు జనసేనలో చేరితో ఆ పార్టీకి మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ఇదివరకే పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైఎస్ జగన్ కబంధ హస్తాల నుంచి ఏపీని విడిపించేందుకు పొత్తు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో అటు టీడీపీ నుంచి వైసీపీలోకి.. వైసీపీ నుంచి టీడీపీలోకి.. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ నుంచి జనసేనలోకి చేరికలు జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 02:08 PM