Nara Lokesh: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి

ABN, First Publish Date - 2023-02-24T23:42:57+05:30 IST

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నారా లోకేష్ అన్నారు.

తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టాలీవుడ్ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Junior NTR)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లోకేష్‌ ఆకాంక్షించారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనస్సు అని లోకేష్‌ అన్నారు. అలాంటివారు సమాజాన్ని ముందుకుతీసుకెళ్లేందుకు రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. 1983, 1985 ఈ రెండుసార్లు మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిందని, టీడీపీ గెలవని చోట గెలిచి, కంచుకోటగా మార్చాలనుకున్నానని లోకేష్‌ స్పష్టం చేశారు. మొదటిసారి ఫెయిల్ అయ్యా.. అయినా తనలో ఫైర్‌ ఉందని, 2024లో మంగళగిరిలో గెలిచి చరిత్ర సృష్టిస్తామని నారా లోకేష్‌ పేర్కొన్నారు.

పారిశ్రామిక ప్రగతి, సామాజిక అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చెప్పారు. పేదల పట్ల జగన్ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, చివరకు రేషన్ కార్డులు కూడా తొలగిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఆటోడ్రైవర్ల సమావేశమైన లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలక్ట్రిక్ ఆటోలను అందించే ప్రక్రియకు శ్రీకారం చుడతామన్నారు. తిరుపతి నియోజకవర్గంలో అంకుర ఆస్పత్రి వద్ద విడిది కేంద్రంలో ఆటో ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నారా లోకేష్ అన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ఈ మూడు కలిసి కట్టుగా వెళ్తేనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, టీడీపీ హయాంలో 40వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. 32 వేల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, సులభ రుణాలతో స్వయం ఉపాధి కల్పించామన్నారు. 35 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నామని లోకేష్ అన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, రాజకీయ కక్షతో ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, కక్ష సాధింపునకు చూపే శ్రద్ధలో కొంత అభివృద్ధిపైన చూపితే పరిశ్రమలు వస్తాయని లోకేష్ తెలిపారు. అయితే వారి తీరు వల్ల అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయని, జగన్ ఓడిపోయిన రోజు వెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ పరిగెత్తుకుంటూ వస్తాయని లోకేష్ చెప్పారు.

Updated at - 2023-03-08T18:18:43+05:30