Share News

Majlis- Congress: మజ్లిస్‌- కాంగ్రెస్ దోస్తానా..? ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఎంపికతో చర్చ

ABN , First Publish Date - 2023-12-10T13:00:21+05:30 IST

కొత్త ఎమ్మెల్యేలు కొలువుదీరే వేళ.. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీని నియమించడం మజ్లిస్‌ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని

Majlis- Congress: మజ్లిస్‌- కాంగ్రెస్ దోస్తానా..? ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఎంపికతో చర్చ

- కొన్నేళ్లుగా రెండు పార్టీల మధ్య ఉప్పు.. నిప్పు

- రానున్న రోజుల్లో ప్రతిపక్షమా.. ప్రభుత్వ పక్షమా..

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): కొత్త ఎమ్మెల్యేలు కొలువుదీరే వేళ.. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీని నియమించడం మజ్లిస్‌ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికలకు ముందు ఉప్పు- నిప్పులా ఉన్న మజ్లిస్‌, కాంగ్రెస్‏ల మధ్య సంబంధాల నేపథ్యంలో శనివారం చోటు చేసుకున్న పరిణామాలు ఆ రెండు పార్టీలు దగ్గరైనట్లు ఆయా పార్టీల్లో చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌ మరణానంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు.. కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో అక్బరుద్దీన్‌ ఒవైసీ జైలు పాలు కావడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోయింది. అప్పట్లో అక్బరుద్దీన్‌ చెప్పిన మాటలు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో కలవరం నింపాయి. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతామని నాడు ఆయన హెచ్చరించారు.

ప్రతిచోటా పోటీ

చెప్పినట్లే కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడానికి పలుచోట్ల మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలిపినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా కాంగ్రె్‌సకు నష్టం చేయడంకంటే బీజేపీకి లబ్ధి చేకూరుస్తోందనే అభిప్రాయాలు కూడా దేశవ్యాప్తంగా వ్యక్తమయ్యా యి. దీంతో తాము బీజేపీకి బీ టీమ్‌ కాదని అసదుద్దీన్‌ ఒవైసీ పలుమార్లు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

zzzz.jpg

ప్రత్యర్థి కాంగ్రెస్సే

తాజా ఎన్నికల్లోనూ రాష్ట్రంలో సిట్టింగ్‌ స్థానాలతో పాటు రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌లో అభ్యర్థులను దించడానికి కాంగ్రె్‌సను నష్ట పరచడానికేనని ఆరోపణలు వినిపించాయి. ఫలితాలు కూడా అలాగే కనిపించాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మజ్లిస్‌ తమ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి దించి కాంగ్రె్‌సకు నష్టం కలిగించిందనే వార్తలు కూడా వైరల్‌గా మారాయి. ఛత్తీస్‏ఘఢ్‌, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తోందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినా.. వాస్తవ ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో ఎంఐఎం వల్లనే నష్టపోయినట్లు కూడా ఆరోపణలు వినిపించాయి. కాంగ్రెస్‏పై కక్ష సాధింపు బీజేపీకి లబ్ధి చేకూరుస్తోందనే సంకేతాల నేపథ్యంలో ముస్లిం పెద్దలు సైతం కాంగ్రె్‌సతో మజ్లిస్‌ సయోధ్య బెటర్‌ అనే సందేశాలు ఇస్తున్నారు.

వైఖరి మారిందా..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మజ్లిస్‌ పార్టీ ఎటువైపు మొగ్గు చూపుతోందనే విషయం ఆసక్తికరంగా మారింది. పదేళ్లనుంచి బీఆర్‌ ఎ్‌సతో దోస్తీ చేసిన పార్టీ రాష్ట్రంలో ఆ పార్టీవైపే ఉంటుందా.. లేక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన తర్వాత అసదుద్దీన్‌ సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడంతోపాటు ప్రతిపక్షంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ప్రకటించారు. అయితే, గతం లో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మజ్లిస్‌ ప్రతిపక్షంలో ఉంటుందా? లేక ప్రభుత్వంతో కలిసేందుకు ఏమైనా ప్లాన్‌ చేస్తుందా అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసి ప్రారంభించిన సంబంధాలు పార్లమెం ట్‌ ఎన్నికలకు ముందు ఆ రెండు పార్టీల మధ్య బలమైన బంధంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - 2023-12-10T13:12:25+05:30 IST