Governor Vs CM: గవర్నర్ ప్రసంగంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-01-30T16:34:57+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం (Telangana Governament) కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai)పై హైకోర్టులో వేసిన పిటిషన్‌...

Governor Vs CM: గవర్నర్ ప్రసంగంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Governament) కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai)పై హైకోర్టులో వేసిన పిటిషన్‌ (Petition)ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గతంలో రెండు సార్లు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని అనుకున్న ప్రభుత్వం మనసు మార్చుకుని.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే హైకోర్టుకు వెల్లడించారు.

వాస్తానికి ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపాల్సి ఉన్నందున అనుమతి కోరుతూ ఈ నెల 21నే గవర్నర్‌కు లేఖ పంపింది. అయితే గవర్నర్‌ తమిళిసై మాత్రం అనుమతి తెలపలేదు. రాజ్‌భవన్ (Raj Bhavan) నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో సోమవారం హైకోర్టు (High Court)లో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవేను రంగంలోకి దించింది. ప్రజాపద్దును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు తక్షణమే అనుమతించేలా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరలనుకున్నారు. కానీ ఉన్నట్లుండి హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ (Lunch Motion Petition) ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని లాయర్‌ దుష్యంత్‌ దవే తెలిపారు.

6న అసెంబ్లీలో బడ్జెట్‌!

శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు (Budget meetings) ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ (Assembly)లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని ప్రభుత్వం మార్చుకుంది. 3వ తేదీకి బదులు 6న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. నిజానికి డిసెంబరులో శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచించింది. కానీ బీఆర్‌ఎస్‌ (BRS)ను విస్తరించే నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ (CM KCR) ఢిల్లీ వెళ్లడంతో సమావేశాలు జరగలేదు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 6, 12, 13 తేదీల్లో జరిగాయి. అప్పటి నుంచి ఆరు నెలల్లోపు (మార్చి 13లోపు) సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కాగా, ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అందులో వచ్చే నిధులను పరిశీలించి, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. గత బడ్జెట్‌ సమావేశాలు కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే జరగడంతో రాద్ధాంతంగా మారింది.

రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదాన్ని రాజేసింది. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సి ఉన్నందున.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి అనుమతి ఇస్తున్నట్లు అప్పట్లో గవర్నర్‌ వెల్లడించారు. కానీ అంతకుముందు సమావేశాలకు కొనసాగింపుగానే బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తున్నామని, ఈ దృష్ట్యా గవర్నర్‌ అనుమతి అవసరం లేదని, స్పీకర్‌ సమావేశాలను ప్రారంభించవచ్చంటూ అప్పట్లో ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. నిజానికి బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ ప్రారంభించడం సంప్రదాయం. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. ఇలాంటి వ్యవహారం ఏమీ లేకుండానే బడ్జెట్‌ సమావేశాలను నిర్వహిస్తుండడం సర్వత్రా చర్చనీయంగా మారుతోంది.

Updated Date - 2023-01-30T17:07:05+05:30 IST