Bandi Sanjay: TSPSC పేపర్‌ లీక్‌పై బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-20T21:51:53+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: TSPSC పేపర్‌ లీక్‌పై బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు ప్రస్తావించిన కేటీఆర్‌కు నోటీసులిచ్చే దమ్ము సిట్‌కు ఉందా? అని బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు. నోటీసుల పేరుతో ప్రతిపక్షాల గొంతునొక్కాలని చూస్తున్నారని, సిట్ కేసీఆర్ జేబు సంస్థ.. ఆధారాలిచ్చే ప్రసక్తే లేదన్నారు. సిట్ విచారణకు భయపడే ప్రసక్తే లేదని, పేపర్‌ లీక్‌లో నిజాలు బయటకొస్తే కొడుకు జైలుకెళ్తాడనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు కేసీఆర్‌ భయపడుతున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. కొడుకు తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, సిట్టింగ్ జడ్జితో విచారిస్తే తాము ఆధారాలు ఇస్తామని బండి సంజయ్‌ అన్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్(TSPSC Paper Leak) కేసులో నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును సీబీఐ(CBI)తో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన ఆమె.. పోలీసులు థర్డ్ డిగ్రీ (Third Degree) ప్రయోగించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు జరిపిన విచారణను వీడియోలో చూపించాలని సుచరిత కోర్టును కోరింది. పిటిషన్‌లో ప్రతివాదులుగా డీజీపీ(DGP), చీఫ్ సెక్రటరీ(Chief Secretary), సిట్(SIT), హైదరాబాద్ సిటీ డీసీపీలను సుచరిత పేర్కొంది.

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్(TSPSC Paper Leak) వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్‌రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. రాజశేఖర్‌రెడ్డి విదేశాల్లో ఉన్న బంధువులతో గ్రూప్-1 రాయించారు. విదేశాల్లో ఉన్న బంధువులిద్దరిని రప్పించి మరీ గ్రూప్-1 పరీక్ష రాయించారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ దంపతులు ఇక్కడికి వచ్చి పరీక్ష రాయడంపై అప్పట్లోనే వారి స్వగ్రామం జగిత్యాల జిల్లా తాటిపల్లిలో చర్చనీయాంశంగా మారింది.

పరీక్ష రాసిన రాజశేఖర్ బంధువులు ప్రిలిమ్స్‌కు క్వాలిఫై అయ్యారు. అయితే రాజశేఖర్ ముందే పేపర్ లీక్ చేసి బంధువులకు ఇచ్చాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులు ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. వారందరినీ ఆరు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో చంచల్‌గూడ జైలు నుంచి 9 మంది నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు.

వైద్య పరీక్ష కంప్లీట్ అయిన తర్వాత సిట్ కార్యాలయానికి తరలించి అక్కడే ఆరు రోజులపాటు పూర్తిగా విచారించి వారి స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేసులో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారని ఇప్పటికే సిట్ కొన్ని ఆధారాలు సేకరించారు. అతని ద్వారా పేపర్ లీక్ అయినట్లు సిట్ అధికారులు అన్నీ ఎవిడెన్స్ సేకరించారు. గతంలో కూడా రాజశేఖర్ అనేక పేపర్లను లీక్ చేశారు. విదేశాల్లో ఉన్న తన బంధువులను సైతం తీసుకొచ్చి ఇక్కడ గ్రూప్-1 ఎగ్జామ్ రాయించినట్లు కొన్ని ఆధారాలను అధికారులు సేకరించారు.

Updated Date - 2023-03-20T22:02:29+05:30 IST