Kalvakuntla Kavitha: మమతను, నితీశ్‌ను అందుకే పిలవలేదు

ABN , First Publish Date - 2023-02-23T20:17:58+05:30 IST

జాతీయ మీడియా సంస్థ ఎన్‌డీటీవీకి బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ఇంటర్వ్యు ఇచ్చారు.

  Kalvakuntla Kavitha: మమతను, నితీశ్‌ను అందుకే పిలవలేదు
Kalvakuntla Kavitha important comments in exclusive interview to NDTV

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం సూచించారు. జాతీయ మీడియా సంస్థ ఎన్‌డీటీవీ(NDTV)కి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యు ఇచ్చారు. అందులో ప్రతిపక్షాల ఐక్యత, కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపై మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమవ్వడంలో సవాళ్లు ఏమీ లేవని కవిత చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే అన్నారని, కానీ దేశంలో అన్ని చోట్లా కాంగ్రెస్‌కు బలం లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి దేశంలో 2 వేల ఎమ్మెల్యే స్థానాలు కూడా లేవని, మిగతా స్థానాలు ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్నాయని కవిత చెప్పారు. అయినా కూడా తామే ప్రతిపక్ష పార్టీలకు నేతృ త్వం వహిస్తామని కాంగ్రెస్ అంటోందని ఆమె ఎద్దేవా చేశారు. వివక్షాలపై కూర్చొని పని చేయాలని కాంగ్రెస్ భావిస్తే.. ఆ పార్టీ అహంకారాన్ని వదిలిపెట్టాలని, వాస్తవాలను గ్రహించాలని, దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షాలకు ఎలా నేతృత్వం వహిస్తుందని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee), బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) బిజీగా ఉండడం వల్ల ఖమ్మం సభకు వారిని ఆహ్వానించలేదని వెల్లడించారు. ఏప్రిల్ 14న జరిగే సభకు మమతా బెనర్జీకి ఆహ్వానం వెళ్లిందో లేదో తనకు తెలియదని, కానీ మమతా బెనర్జీతో విబేధాలు ఏమీ లేవని, ఒకసారి కేసీఆర్ కూడా వెళ్లి కలిశారని చెప్పారు. యూపీఏ కూటమిలో ఉన్న అనేక పార్టీలకు కేవలం రెండు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయని, పెద్ద పార్టీల్లో డీఎంకే తప్ప మిగతా ఇతర పార్టీలు యూపీఏలో లేవని చెప్పారు. ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యం ఏమిటి అనేదే ప్రధానమని స్పష్టం చేశారు.

దేశాన్ని సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలించాయని, అయినా కూడా ఇంటింటికి తాగునీరు, విద్యుతు ను అందించలేకపోయాయని, దేశంలో ఈ పరిస్థితిలో ఉండడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని కవిత ఆరోపించారు. దేశానికి మంచి జరగాలంటే ఆ రెండు పార్టీలు కాకుండా ప్రత్యామ్నాయం రావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, కేరళలో పినరాయి విజయన్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పనుల వల్ల మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. దేశం మారుతుందని 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు అంతా భావించారని, కానీ దేశం ఏం మారిందని కవిత ప్రశ్నించారు. కీలకమైన హామీలను అమలే చేయలేదని, ఉద్యోగాలు కల్పించలేదని, నల్లధానాన్ని విదేశాల నుంచి వెనక్కి తీసుకురాలేదని, రూపాయి విలువ పడిపోవడాన్ని కట్టడి చేయలేదని ఆమె విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లను ఎందుకు జారీ చేయడం లేదన్నారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోనే సమస్య అని ఆమె విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని కాంగ్రెస్.. ఎదుర్కొంటుందా లేదా అని ఆ పార్టీ ఆలోచించుకోవాలని, బీజేపీని గద్దె దించాలన్న ఉద్దేశముంటే దాన్ని ఎదుర్కొనలేని పరిస్థితుల్లో, తక్కువ సీట్లు వచ్చే అవకాశమున్న చోట్ల క్షేత్రస్థాయిలో అందరితో కలిసి పనిచేయాలని సూచించారు. బీజేపీని గద్దె దించకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తాము భావిస్తున్నామని తెలిపారు. విపక్షాల్లో అందరం కలిసి బీజేపీని గద్దె దించుతామని కవిత తెలిపారు.

పవన్ ఖేర అరెస్టుపై స్పందిస్తూ దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తోందని, కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని కవిత స్పష్టం చేశారు. అందుకు విపక్షాలు అన్నీ కలిసిరావాలని, కాంగ్రెస్ కలిసిరాకున్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రాంతీయ పార్టీలకు బలం ఉందని తెలిపారు.

కాంగ్రెస్ పీనరీ ముందు చత్తీస్ ఘడ్ రాయ్ పూర్‌లో ఈడీ దాడులు జరిగాయని, విపక్షాలు సమావేశాలు పెట్టుకున్నా కూడా భయపడుతున్నారంటే దేశం ఏ పరిస్థితిలో ఉందో అర్థమవుతోందని కవిత అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు మద్దతు వస్తోందని బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. తాను తినను, తిననివ్వనని ప్రధాని మోదీ చెబుతుండేవారని, కానీ జనవరి 25వ తేదిన హిండెన్బర్గ్ తర్వాత కొంత మందిని కాపాడడానికి ప్రధాని చేస్తున్న ప్రయత్నం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. మోదీకి ఉన్న అవినీతిరహిత ఇమేజ్ ఇప్పుడు లేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారని, వాటిని అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని విమర్శించారు.

ఈడీ, సీబీఐలను అడ్డంపెట్టుకొని భయపెట్టాలని చూస్తే సమస్య లేదని, తమపై చర్యలు తీసుకోవచ్చవని కవిత చెప్పారు. అదే సమయoలో ఆదానీపై కూడా తీసుకోవాలని అని అన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. తాము దర్యాప్తు సంస్థలను స్వాగతిస్తున్నామని, ఆదానీ ఎందుకు స్వాగతించడం లేదని అడిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిదికాదని అన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మోదీ వెళ్లే ముందే ఈడీ వెళ్తుందని అందరికీ తెలుసన్నారు. వ్యవస్థను నాశనం చేసు తెస్తున్నారని, సీబీఐ, ఈడీ ఎన్నికల సంఘం, ఐబీ, పోలీసు వంటి సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని అనుకోవడానికి లేదని, ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, అనే మోనర్లు దేశంలోనూ అమలు చేయాలన్న ఉద్దేశంతో. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చాలని కవిత వివరించారు. దేశానికి మంచి చేయాలని తాము ముందుకొస్తే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. 2014కు ముందు ప్రధాని మోదీ చెప్పిన గురజాత్ మోడల్ కు, ఇప్పుడు తెలంగాణ మోడల్ మొత్తం వేర్వేరని, గుజరాత్ కంటే తెలంగాణ మోడల్ ఉత్తమమైనదని, ఫలితాలు కళ్లముందు ఉన్నాయని వివరించారు

Updated Date - 2023-02-24T00:32:43+05:30 IST