DK Shivakumar YS Sharmila: డీకే.శివకుమార్-షర్మిల భేటీపై టీపీసీసీ స్పందన ఇలా..!

ABN , First Publish Date - 2023-05-29T16:46:20+05:30 IST

కేసీఆర్ పాలనలో తెలంగాణ నలిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప

DK Shivakumar YS Sharmila: డీకే.శివకుమార్-షర్మిల భేటీపై టీపీసీసీ స్పందన ఇలా..!
Mahesh Kumar Goud

హైదరాబాద్: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ (DK Shivakumar)తో వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల (YS Sharmila) భేటీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ స్పందించారు. వారిద్దరూ కలవడం మంచి పరిణామం అని తెలిపారు. సెక్యులర్ పార్టీలు ఎవరైనా కాంగ్రెస్ నేతలను కలవచ్చని అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 2న తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ర్యాలీలు చేపట్టాలని తెలంగాణ పీసీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ కోసం కాంగ్రెస్ కమిటీ వేయనుందని వెల్లడించారు. జూన్ 2న హైదరాబాద్ అమరవీరుల స్థూపం నుంచీ గాంధీభవన్ వరకూ భారీ ర్యాలీ చేపట్టనున్నారు. రాష్ట్రం ఎవరి వల్ల వచ్చిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ ఎలా మోసపోయిందో ప్రజలకు వివరించేలా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే తెలంగాణ కోసం కష్టపడ్డ ఎంపీలకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు జూన్ 2న గాంధీ భవన్‌లో సన్మానం చేయనున్నట్లు వివరించారు.

dd.jpg

తెలంగాణ ఇచ్చిన స్వప్నం సాకారం కాలేదని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నలిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప ఉద్యమకారులకు ఉద్యోగాలు దక్కలేదని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన వాళ్లు కేసీఆర్ క్యాబినెట్‌లో ఉన్నారని చెప్పారు. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రజలందరినీ మోసం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కి ఓటేస్తే తెలంగాణ భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అసలు సోనియా స్థానంలో వేరే వాళ్లు ఉంటే తెలంగాణ వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: YSRTP : బెంగళూరు వెళ్లి మరీ డీకేను కలిసిన వైఎస్ షర్మిల.. 15 రోజుల వ్యవధిలోనే రెండోసారి.. ఏం నడుస్తోంది..?

Updated Date - 2023-05-29T16:46:20+05:30 IST