DGP: తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. పోలీసులకు డీజీపీ కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2023-07-27T11:01:16+05:30 IST

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్‌ విభాగం అప్రమత్తం అయ్యింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

DGP: తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. పోలీసులకు డీజీపీ కీలక ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్‌ విభాగం అప్రమత్తమైంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ అప్రమత్తం చేశారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 24 గంటలు అందుబాటులో ఉండాలని సిబ్బందికి ఆదేశించింది. సహాయం కోసం డయల్ 100కు లేదా స్థానిక పోలీసు పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, ఈ జలాశయాల వద్దకు ఎవరు వెళ్లకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు.

వరద ఉధృతితో తెగిపోయిన రోడ్లు, ఉధృతంగా ప్రవహించే కాజ్ వేల వద్దకు ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్లలోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని డీజీపీ సూచించారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని.. వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను గానీ చేతులతో తాకకుండా, ఇతర జాగ్రత్త చర్యలపై ప్రజలను చైతన్య పర్చాలని సిబ్బందికి ఆదేశించారు. వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదని సూచించారు. జలపాతాలు, నిండిన చెరువుల మత్తళ్ల వద్దకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2023-07-27T11:01:16+05:30 IST