TD Janardhan: పీకే సర్వేలో కూడా వైసీపీ ఓడిపోతుందని తేలింది
ABN , First Publish Date - 2023-10-02T16:19:42+05:30 IST
పీకే సర్వేలోకూడా వైసీపీ ప్రభుత్వం(YCP Govt) ఓడిపోతుందని తేలిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత టీడీ జనార్ధన్(TD Janardhan) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్(ఎన్టీఆర్ భవన్): పీకే సర్వేలోకూడా వైసీపీ ప్రభుత్వం(YCP Govt) ఓడిపోతుందని తేలిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత టీడీ జనార్ధన్(TD Janardhan) వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్కు నిరసనగా ఎన్టీఆర్భవన్లో సోమవారం నాడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అవినీతి పరులు అధికారంలోకి వస్తే నిజాయతీ పరులు జైలుకు వెళ్తారనేది ఆంధ్రదేశంలో నడుస్తోంది. సీ ఓటర్ సర్వేలో 15 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశానికి వస్తాయని తేలింది. పీకే సర్వేలోకూడా వైసీపీ ఓడిపోతుందని తేలింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి నిద్రపట్టక పోవడంతో చంద్రబాబును జైలుకు పంపాలని నిర్ణయించారు.
ప్రభుత్వం వచ్చిన ఇన్ని రోజులకు కేసు గుర్తుకు వచ్చింది. ఆధారాలు ఏవని అడిగితే ఆధారాల కోసమే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశామని చెప్పడం దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ నిప్పులాంటి మనిషి.. ఆస్తులను త్యజించి రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు ఒక్కరోజు కూడా ఖాళీగా లేరు. బాబుపై రాజశేఖరరెడ్డి కూడా కేసులు వేశారు. ఒక్క కేసును కూడా న్యాయస్థానాలల్లో నిరూపించలేకపోయారు. టీడీపీ నేతలు చంద్రబాబు విడుదల కావాలని ప్రార్థనలు చేస్తున్నారు. అందులో భాగంగా నేడు సత్యాగ్రహ దీక్ష చేపట్టాం. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలి. సోషల్ మీడియా ప్రచారం ద్వారా ఉద్యమానికి ప్రజలను సమాయత్తం చేయాలి’’ అని టీడీ జనార్ధన్ పేర్కొన్నారు.