IT Raids: తెలంగాణలో ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్‌ఎస్‌‌లో ఎందుకంత టెన్షన్ అంటే..

ABN , First Publish Date - 2023-06-14T10:50:29+05:30 IST

తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.

IT Raids: తెలంగాణలో ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్‌ఎస్‌‌లో ఎందుకంత టెన్షన్ అంటే..

హైదరాబాద్: తెలంగాణలో (Telangana State) బీఆర్‌ఎస్ నేతల (BRS Leaders) ఇళ్లలో ఐటీ సోదాలు (IT Raids) కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ముందుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (MP Kotha Prabhakar Reddy) నివాసాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నాయి. కొండాపూర్‌లోని లుంబిని ఎస్‌ఎల్‌ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్‌లో ఎంపీ ఉండే ఇంటితో పాటు కార్యాలయాలపైన ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు మధ్య ఈ సోదల ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అలాగే యాదాద్రి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (MLA Pailla Shekar Reddy) నివాసం, కంపెనీల్లో ఈరోజు ఉదయం నుంచి ఏకకాలంలో ఐటీ సోదాలు చేపట్టింది. భువనగిరి, హైదరాబాద్‌ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని కార్యాలయాల్లో మొత్తం 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌ కంపెనీలకు పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కొత్తపేటలో ఉన్నారు. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే నివాసాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే నివాసంలో ఐటీ అధికారులు సుమారు 30 బృందాలతో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను చెల్లింపు వివరాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో కీలక డాక్యుమెంట్లను ఐటీ సీజ్ చేసింది. రెండు కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లు, ఆస్తుల పాత్రలను ఐటీ సీజ్ చేసింది. రెండు వాహనాల్లో రాజశేఖర్ రెడ్డి ఇంటి నుంచి ఐటీ అధికారులు మరో చోటకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇటు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి (MLA Marri Janardhan Reddy) చెందిన షాపింగ్ మాల్‌పై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. కేపీహెచ్‌బీ కాలనీలోని జేసీ బ్రదర్స్‌లో ఐటీశాఖ తనిఖీలు చేపట్టింది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ బ్రదర్స్‌కు సంబంధించి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, అతని బంధువులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఏకకాలంలో ఐటీ తనిఖీలపై ఆసక్తికర చర్చ..

అయితే కేంద్రమంత్రి, బీజేపీ నేత అమిత్‌ షా (Union Minister Amit Shah) తెలంగాణ పర్యటన వేళ ఐటీ సోదాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ నేతలే టార్గెట్‌గా ఈ సోదాలు జరగడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. మునుముందు మరికొంతమంది అధికార పార్టీ నేతల ఇళ్లలోనూ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఐటీ తనిఖీలు జరగడం, అది కూడా అధికార బీఆర్‌ఎస్‌‌లో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలే టార్గెట్‌గా సాగుతుండటంతో బీఆర్‌ఎస్‌లో కలవరపాటు మొదలైంది.

Updated Date - 2023-06-14T10:54:08+05:30 IST