Telugu States CMs: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

ABN , First Publish Date - 2023-03-22T09:12:59+05:30 IST

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Telugu States CMs: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

హైదరాబాద్/ అమరావతి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల (Two Telugu States CMs) ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు.

రైతులు, ప్రజలకు శుభాలు చేకూర్చాలి: కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 'శోభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

అన్నీ శుభాలే జరగాలి: జగన్

రాష్ట్ర ప్రజలందరికీ సీఎం వైఎస్ జగన్‌మోహన రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ తెలిపారు.

Updated Date - 2023-03-22T09:37:36+05:30 IST