Bandi Sanjay: బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం

ABN , First Publish Date - 2023-06-02T12:36:36+05:30 IST

బీజేపీ మద్దతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. రా

Bandi Sanjay: బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం

హైదరాబాద్: బీజేపీ (BJP) మద్దతోనే తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం 4 లక్షల కోట్ల నిధులు విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతోందన్నారు. నలుగురి కోసం మాత్రమే రాష్ట్రం ఏర్పడినట్టు ఉందని.. రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజ్ రీయింబర్స్మెంట్ ముందుగానే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని... నిలువ నీడ లేని పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు. పంట నష్టపరిహారం 10 వేల ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.

తాము అధికారంలోకి రాగానే ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకోవడం కంటే దుర్మార్గం ఇంకొక్కటి ఉందా అని నిలదీశారు. 21 రోజులు.. రోజుకో డిపార్ట్‌మెంట్‌ బీఅర్ఎస్‌కు (BRS) ప్రచారం చేయాలని ఉద్యోగుల మీద ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు అభ్యర్థులు గల్లంతయ్యారని అన్నారు. అనేక మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన పార్టీ కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను లేపే ప్రయత్నం బీఆర్‌ఎస్ చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోడీ సహకరించినా కేసీఆర్ దానికి సిద్ధంగా లేరన్నారు. గడిల పాలనను అంతమొందించడానికి బీజేపీ ముందడుగు వేస్తోందని తెలిపారు. ఒక కుటుంబం చేతిలో బంధీఅయిన తెలంగాణ తల్లిని విడిపించడానికి బీజేపీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-02T12:36:36+05:30 IST