ఐర్లాండ్ పర్యటనకు రాహుల్ ద్రావిడ్ దూరం.. మరి టీమిండియా హెడ్ కోచ్ ఎవరంటే..?

ABN , First Publish Date - 2023-07-17T16:45:38+05:30 IST

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆ తర్వాత ఐర్లాండ్‌లో పర్యటించనుంది. వచ్చే నెలలోనే ఈ పర్యటన ఉండనుంది. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఆగష్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బంది ఐర్లాండ్ పర్యటనకు వెళ్లడం లేదు.

ఐర్లాండ్ పర్యటనకు రాహుల్ ద్రావిడ్ దూరం.. మరి టీమిండియా హెడ్ కోచ్ ఎవరంటే..?

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆ తర్వాత ఐర్లాండ్‌లో పర్యటించనుంది. వచ్చే నెలలోనే ఈ పర్యటన ఉండనుంది. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఆగష్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బంది ఐర్లాండ్ పర్యటనకు వెళ్లడం లేదు. ద్రావిడ్ కోచింగ్ సిబ్బంది అంతా వెస్టిండీస్ పర్యటన ముగియగానే విశ్రాంతి కోసం స్వదేశానికి రానున్నారని తెలుస్తోంది. ప్రధాన కోచ్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో సహా ఇతర కోచింగ్ సిబ్బంది ఐర్లాండ్ పర్యటనకు దూరంగా ఉంటున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


దీంతో రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో ప్రస్తుతం ఎన్సీఏ చైర్మన్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టుకు ప్రధాన కోచ్‌‌గా ఉంటారని సమాచారం. లక్ష్మణ్ కోచింగ్ సిబ్బందిలో బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్ లేదా హృషికేష్ కనిట్కర్, బౌలింగ్ కోచ్‌గా ట్రాయ్ కూలీ లేదా సాయిరాజ్ బహుతులే ఉండే అవకాశాలున్నాయి. కాగా ద్రావిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా ఉండడం ఇది కొత్తేం కాదు. గతేడాది భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించినప్పుడు కూడా లక్ష్మణే ప్రధాన కోచ్‌గా ఉన్నారు. ఇక ఐర్లాండ్‌ పర్యటనకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా కొంతకాలంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు 30+ వయసున్న ఆటగాళ్లను సెలెక్టర్లు టీ20 జట్టుకు దూరంగా ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీ ఐర్లాండ్ పర్యటనలో ఆడే అవకాశాలు లేవు. అంతేకాకుండా గాయాల కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ ఐర్లాండ్ పర్యటనతో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-07-17T16:45:38+05:30 IST