Manoj Tiwary: క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్ కమ్ మంత్రి
ABN , First Publish Date - 2023-08-03T16:20:51+05:30 IST
టీమిండియా సీనియర్ ఆటగాడు మనోజ్ తివారీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం వెల్లడించాడు. తన రిటైర్మెంట్ విషయాన్ని తివారీ భావోద్వేగంతో ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.
టీమిండియా సీనియర్ ఆటగాడు మనోజ్ తివారీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం వెల్లడించాడు. తన రిటైర్మెంట్ విషయాన్ని తివారీ భావోద్వేగంతో ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ‘‘క్రికెట్ ఆటకు గుడ్బై. ఈ ఆట నాకు అన్ని ఇచ్చింది. క్రికెట్కు, నా పక్షాన ఎప్పుడూ ఉండే దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. నా క్రికెట్ ప్రయాణంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యావాదాలు తెలియజేస్తున్నాను. నా బాల్యం నుంచి గత సంవత్సరం వరకు నా క్రికెట్ విజయాల్లో భాగస్వామ్యమైన నా కోచ్లందరికీ ధన్యవాదాలు. మనబేంద్ర ఘోష్, కోచ్ లాంటి మా నాన్నగారు క్రికెట్ ప్రయాణంలో నాకు మూలస్తంభం. మా నాన్న, అమ్మకు ధన్యవాదాలు. వాళ్లిద్దరూ ఎప్పుడూ చదువుపై దృష్టి పెట్టమని నాపై ఒత్తిడి తీసుకురాలేదు. వారు నన్ను క్రికెట్లో కొనసాగమని ప్రోత్సహించారు. నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ నా పక్షాన నిలిచిన నా భార్య సుస్మితకి ధన్యవాదాలు. ఆమె మద్దతు లేకుంటే నేను జీవితంలో ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు. నా సహచర ఆటగాళ్లకు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇక్కడ నేను ఎవరినైనా ప్రస్తావించకపోయినట్లైతే దయచేసి నన్ను క్షమించగలరు.’’ అని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తివారీ రాసుకొచ్చారు.
37 ఏళ్ల మనోజ్ తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు. తివారీ భారత జట్టుకు చివరగా 2015లో ప్రాతినిధ్యం వహించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో ఆడినదే తన అంతర్జాతీయ కెరీర్లో చివరి మ్యాచ్. ఇక తన డొమెస్టిక్ క్రికెట్లో చివరి మ్యాచ్ను ఫిబ్రవరిలో ఆడాడు. ఆ నెలలో జరిగిన రంజీ ట్రోఫి ఫైనల్లో పశ్చిమ బెంగాల్ జట్టుకు తివారీ కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. తివారీ అంతర్జాతీయ క్రికెట్లో 2008 నుంచి 2015 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 3 ఫిబ్రవరి 2008న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్తో మనోజ్ తివారీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. యువరాజ్ సింగ్ స్థానంలో 2011లో వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆ పర్యటనలోనే ఐదో వన్డే మ్యాచ్లో తన కెరీర్ మొదటి సెంచరీని సాధించాడు. అయినప్పటికీ దురదృష్టవశాత్తూ తివారీ ఆ తర్వాత వరుసగా 14 మ్యాచ్లు రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. టీమిండియాకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కలేదు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 287 పరుగులు, టీ20ల్లో 15 పరుగులు చేశాడు. వన్డేల్లో 5 వికెట్లు తీశాడు.
ఇక ఐపీఎల్లోనూ 98 మ్యాచ్లాడిన తివారీ 1695 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలున్నాయి. కాగా ఐపీఎల్లో తివారీ ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్కతానైడ్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2018-19 విజయ్ హజారే ట్రోఫీలో 9 మ్యాచ్ల్లో మనోజ్ తివారీ 366 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2018లో ఐదో డబుల్ సెంచరీ సాధించాడు. 2020లో తొలిసారి ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. మనోజ్ తివారీ ఒకవైపు క్రికెటర్గా కొనసాగుతూనే మరోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తన రాష్ట్రం పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సిబ్పుర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రస్తుతం బెంగాల్ క్రీడా శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.