Share News

Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై? కొత్త కోచ్‌గా తెలుగోడు..

ABN , First Publish Date - 2023-11-23T12:52:03+05:30 IST

Team India Head coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోనున్నాడా? అంటే అవుననే సమాధానాలే అంతటా వినిపిస్తున్నాయి. కోచ్‌గా కొనసాగడానికి ద్రావిడ్ ఆసక్తి కనబర్చడం లేదని ఎన్సీఏ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ద్రావిడ్ స్థానంలో నూతన హెడ్ కోచ్‌గా తెలుగు వ్యక్తి, ద్రావిడ్ సహచర క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రానున్నాడని సమాచారం

Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై? కొత్త కోచ్‌గా తెలుగోడు..

టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోనున్నాడా? అంటే అవుననే సమాధానాలే అంతటా వినిపిస్తున్నాయి. కోచ్‌గా కొనసాగడానికి ద్రావిడ్ ఆసక్తి కనబర్చడం లేదని ఎన్సీఏ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ద్రావిడ్ స్థానంలో నూతన హెడ్ కోచ్‌గా తెలుగు వ్యక్తి, ద్రావిడ్ సహచర క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రానున్నాడని సమాచారం. గత ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌తో ద్రావిడ్ రెండేళ్ల పదవి కాలం ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్‌గా కొనసాగకూడదని ద్రావిడ్ నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. 2021 నుంచి టీమిండియాకు ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టాడానికి ముందే భారత ఏ జట్టుకు కోచ్‌గా పని చేశాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్‌గా కూడా ఉన్నాడు. ద్రావిడ్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో భారత జట్టు 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ వరకు చేరింది. ఈ ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్‌ల్లో ఫైనల్స్ వరకు వెళ్లింది. ఆసియాకప్‌ విజేతగా నిలిచింది.


ఫైనల్ ముగిసిన తర్వాత తన భవిష్యత్ గురించి అడినప్పుడు ఇంకా ఆలోచించలేదని ద్రావిడ్ సమాధానం ఇచ్చాడు. ‘‘ నేను దాని గురించి ఆలోచించలేదు. నేను ఇప్పుడే ఆట నుంచి బయటికి వచ్చాను. దీని గురించి ఆలోచించడానికి నాకు సమయం లేదు. సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తాను.’’ అని చెప్పాడు. కాగా టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం ఏన్సీఏ చైర్మన్‌గా ఉన్నాడు. ఇప్పటికే భారత ఏ జట్టుకు, టీమిండియా యువ జట్టుకు లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఏషియన్ గేమ్స్‌లో కూడా భారత యువ జట్టుకు లక్ష్మణే కోచ్‌గా ఉన్నాడు. లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఏషియన్ గేమ్స్‌లో బరిలోకి దిగిన భారత జట్టు గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు కూడా లక్ష్మణే హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటే వీవీఎస్ లక్ష్మణ్‌నే ఆ పదవి వరించే అవకాశాలున్నాయి. అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం టెస్టులకు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కొనసాగాలని అంటున్నారు. వన్డే, టీ20లకు హెడ్ కోచ్‌గా లక్ష్మణ్ ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమిండియాకు ఇద్దరు కోచ్‌లు ఉండడమే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పలు విదేశీ జట్లకు ఫార్మాట్‌ల వారిగా ఇద్దరు హెడ్ కోచ్‌లు ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-23T12:56:17+05:30 IST