Kapil Dev: టీమిండియా క్రికెటర్లకు డబ్బు, అహంకారం, పొగరు.. వారికి అన్నీ తెలుసని అనుకుంటారు

ABN , First Publish Date - 2023-07-30T17:45:33+05:30 IST

ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లకు డబ్బు, అహంకారం, అహం పెరిగిపోయాయంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుత ఆటగాళ్లు తమకు అంతా తెలుసని భావిస్తారని, సీనియర్ల నుంచి సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరని మండిపడ్డారు.

 Kapil Dev: టీమిండియా క్రికెటర్లకు డబ్బు, అహంకారం, పొగరు.. వారికి అన్నీ తెలుసని అనుకుంటారు

ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లకు డబ్బు, అహంకారం, అహం పెరిగిపోయాయంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుత ఆటగాళ్లు తమకు అంతా తెలుసని భావిస్తారని, సీనియర్ల నుంచి సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరని మండిపడ్డారు. "ఈ తరం ఆటగాళ్లలో మంచి విషయం ఏంటంటే.. వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రతికూల అంశం ఏమిటంటే.. వారికి ప్రతిదీ తెలుసునని వారు భావిస్తారు. దాని కంటే మెరుగ్గా ఎలా చెప్పాలో నాకు తెలియదు. వారు ఎవరినీ ఏమి అడగాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. " అని కపిల్ దేవ్ చెప్పారు.


"కొన్నిసార్లు చాలా డబ్బు వస్తుంది, దాని కారణంగా పొగరు, అహంకారం వస్తుంది. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాడు మైదానంలో ఉన్నప్పుడు ఈ క్రికెటర్లు ఎందుకు మాట్లాడరు? ఆయనతో మాట్లాడి సలహాలు తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏంటి? 50 సీజన్ల క్రికెట్ చూసిన గవాస్కర్‌తో మాట్లాడేందుకు వీరికి నామోషీ ఎందుకు? ఆయనకు అన్నివిషయాలు తెలుసు. సునీల్ గవాస్కర్ చెప్పే అంశాలు ప్రస్తుత క్రికెటర్ల ఆలోచనను మార్చవచ్చు. ప్రస్తుత క్రికెటర్లు తమకు అంతా తెలుసని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వారికి ఏమి తెలియదు.’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.

ఇదే అంశంపై ఇటీవల సునీల్ గవాస్కర్ మాట్లాడారు. ప్రస్తుత భారత క్రికెటర్లు సలహాల కోసం తన దగ్గరకు రావడం చాలా అరుదని చెప్పారు. "రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి వాళ్లు క్రమం తప్పకుండా నా వద్దకు వచ్చేవారు. వారు నన్ను ఒక నిర్దిష్ట సమస్యతో సంప్రదించేవారు. నేను గమనించిన లోపాలను వారికి చెప్పేవాడిని. దాని గురించి నాకు అహం లేదు. కానీ ప్రస్తుత తరం ఆటగాళ్లెవరూ నన్ను సంప్రదించలేదు. ప్రస్తుతం టీమిండియాకు ఇద్దరు కోచ్‌లు రాహుల్ ద్రావిడ్(హెడ్‌కోచ్), విక్రమ్ రాథోడ్(బ్యాటింగ్ కోచ్) ఉన్నారు. కాబట్టి ఆటగాళ్లు వారిని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలి. అధిక సమాచారంతో ఆటగాళ్లను గందరగోళానికి గురి చేయకూడదని భావిస్తే ద్రావిడ్, విక్రమ్ రాథోడ్ వెనుకడుగు వేసినట్టవుతుంది." అని గవాస్కర్ ఇటీవల చెప్పారు. కాగా ప్రస్తుతం భారత క్రికెటర్లకు డబ్బు పరంగా ఏ మాత్రం లోటు లేదు. బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ప్రకటనలు వంటి అనేక మార్గాల్లో వారికి ఆదాయ మార్గాలున్నాయి.

Updated Date - 2023-07-30T17:45:52+05:30 IST