IND vs SL: శ్రీలంకతో మ్యాచ్‌ను టీమిండియా ఫిక్స్ చేసింది.. పాక్ లెజెండ్ షోయబ్ అక్తర్ ఏమన్నాడంటే..?

ABN , First Publish Date - 2023-09-13T17:31:47+05:30 IST

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా ఫిక్స్ చేసిందని కొందరి నుంచి తనకు వచ్చిన సందేశాలు, మీమ్స్‌పై పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షోయబ్ అక్తర్ ఘాటుగా స్పందించాడు.

IND vs SL: శ్రీలంకతో మ్యాచ్‌ను టీమిండియా ఫిక్స్ చేసింది.. పాక్ లెజెండ్ షోయబ్ అక్తర్ ఏమన్నాడంటే..?

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా ఫిక్స్ చేసిందని కొందరి నుంచి తనకు వచ్చిన సందేశాలు, మీమ్స్‌పై పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షోయబ్ అక్తర్ ఘాటుగా స్పందించాడు. ‘‘అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌ను భారత్ ఫిక్స్ చేసిందని నాకు సందేశాలు, మీమ్స్ వచ్చాయి. టీమిండియా కావాలని ఓడిపోయి పాకిస్థాన్‌ను ఫైనల్ రేసు నుంచి తప్పించాలని భావిస్తోందనేది ఆ సందేశాలు, మీమ్స్ సారాంశం. మీరు బాగానే ఉన్నారా? శ్రీలంక వాళ్లు మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఆ జట్టు స్పిన్నర్లు వెల్లలాగే, అసలంక వికెట్ల కోసం కఠినంగా శ్రమించారు. ఆ 20 ఏళ్ల కుర్రాడిని చూశారా? 43 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు తీశాడు. అయితే నాకు భారత్, ఇతర దేశాల నుంచి ఫోన్‌లు వచ్చాయి. భారత్ ఉద్దేశపూర్వకంగానే ఓడిపోతోందని వారి ఉద్దేశం’’ అని తన యూట్యూబ్ ఛానెల్‌లో షోయబ్ అక్తర్ అన్నాడు. కాగా 11 ఓవర్లు ముగిసే సమయానికి 80/0తో స్ట్రాంగ్‌గా కనిపించిన టీమిండియా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి చివరకు 213 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్‌కు ఫైనల్ చేరే అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే టీమిండియా మ్యాచ్‌ను ఫిక్స్ చేసిందని, అందుకే కావాలని ఓడిపోతుందని పలువురు షోయబ్ అక్తర్‌తో అన్నారు. దీంతో వారి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన షోయబ్ అక్తర్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు. ఈ క్రమంలో దుష్ప్రచారం చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.


శ్రీలంకపై గెలిస్తే టీమిండియా నేరుగా ఫైనల్ చేరుతుందని, అలాంటప్పుడు వారు ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటారని వారిని ప్రశ్నించాడు. అలాగే మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. "వాళ్లు ఓడిపోవాలని ఎందుకు అనుకుంటారు చెప్పండి? వారు ఫైనల్‌కు వెళ్లాలనుకుంటారు. మీరు ఎటువంటి కారణం లేకుండా మీమ్స్ తయారు చేస్తున్నారు. ఇది టీమిండియా నుంచి గొప్ప పోరాటం. లో స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా పట్టుదలగా ఆడింది. జట్టును గెలిపించేందుకు జస్ప్రీత్ బుమ్రా శక్తి మేర పోరాడు. కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు." అని అక్తర్ చెప్పాడు.

ఈ సందర్భంగా భారత్‌తో మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌పై షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు. బాబర్ అజామ్ జట్టు పోరాటమే లేకుండా ఓడిపోయిందని మండిపడ్డాడు. అలాగే పాక్ పేసర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షా, షాహీన్ ఆఫ్రిది ఫిట్‌నెస్‌ను ప్రశ్నించాడు. ఈ క్రమంలో శ్రీలంక ఆటగాడు వెల్లలాగేపై ప్రశంసలు కురిపించాడు. ‘‘వెల్లలాగే అనే శ్రీలంకకు చెందిన 20 ఏళ్ల కుర్రాడు అద్భుతంగా ఆడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత పోరాటం కనబరుస్తున్నాడు. జట్టును గెలిపించడానికి అతను చేయాల్సినదంతా చేస్తున్నాడు. కానీ మా ఆటగాళ్లు ఈ పోరాటాన్ని చూపించలేకపోతున్నారు. మన ఫాస్ట్ బౌలర్లు బ్యాటింగే చేయరు. షాహీన్ ఆఫ్రిది, హ్యారీస్ రౌఫ్, రసీం షా 10 ఓవర్లు బౌలింగ్ చేసినా గాయపడకుండా ఉంటే చూడాలని ఉంది. ఇక నేను పాకిస్థాన్ నుంచి పోరాటాన్ని కోరుకుంటున్నాను. ’’ అని షోయబ్ అక్తర్ అన్నాడు. కాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో ఫైనల్‌లో కూడా అడగుపెట్టింది.

Updated Date - 2023-09-13T17:34:21+05:30 IST