ఆసియా క్రీడల్లో హర్మన్ ప్రీత్ కౌర్ ఆడనట్టేనా?.. అసలు డీమెరిట్ పాయింట్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసా?..

ABN , First Publish Date - 2023-07-25T16:47:32+05:30 IST

టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు 4 డిమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతోపాటు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించొచ్చు. మ్యాచ్ ఫీజ్ సంగతి పక్కనపెడితే డీమెరిట్ పాయింట్లు కనుక కేటాయిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి.

ఆసియా క్రీడల్లో హర్మన్ ప్రీత్ కౌర్ ఆడనట్టేనా?.. అసలు డీమెరిట్ పాయింట్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసా?..

టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు 4 డిమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతోపాటు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించొచ్చు. మ్యాచ్ ఫీజ్ సంగతి పక్కనపెడితే డీమెరిట్ పాయింట్లు కనుక కేటాయిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు ఆసియా క్రీడల్లో హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు దూరం కానుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక క్రికెటర్‌కు 2 డీమెరిట్ పాయింట్లు కనుక కేటాయిస్తే ఒక టీ20 మ్యాచ్ నుంచి నిషేధం ఎదుర్కొవలసి ఉంటుంది. 24 నెలల లోపల 4 డీమెరిట్ పాయింట్లు కనుక కేటాయిస్తే సదరు క్రికెటర్ ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా 2 టీ20 మ్యాచ్‌ల నుంచి నిషేధం ఎదుర్కొవలసి ఉంటుంది.


బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహరించిన తీరుకుగాను ఐసీసీ ఆమెకు 4 డీమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆమె భారత్ ఆడే తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరం అవుతుంది. భారత మహిళల జట్టు తర్వాత ఆసియా క్రీడల్లో ఆడనుంది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ ఆసియా క్రీడల్లో నాకౌట్ మ్యాచ్‌లకు దూరం కాక తప్పకపోవచ్చు. ఒక వేళ భారత జట్టు ఫైనల్ చేరితే అప్పుడే ఆడడానికి అవకాశం ఉంటుంది. కాగా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఆసియాలో టాప్ ప్లేసులో ఉన్న భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఒక వేళ హర్మన్ ప్రీత్ కౌర్ కనుక జట్టుకు దూరమైతే ఆమె స్థానంలో స్మృతి మంధాన జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.

అసలు ఏం జరిగిదంటే.. బంగ్లాదేశ్‌ ఉమెన్స్ జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 226 పరుగుల లక్ష్య చేధనలో పోరాడుతుంది. ఈ క్రమంలో నహీదా అక్తర్ వేసిన 34వ ఓవర్లో హర్మన్‌ప్రీత్ కౌర్ లెగ్‌బైస్‌లో ఔటైనట్టుగా బంగ్లాదేశ్ ఫీల్డర్లు అప్పీల్ చేశారు. వెంటనే అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ కోపంతో బ్యాట్‌ను స్టంప్స్‌కు కొట్టింది. ఆగ్రహంతో బూతులు తిడుతూ మైదానాన్ని వీడింది. హర్మన్ వికెట్ మ్యాచ్ ఫలితంలో కీలకపాత్ర పోషించింది. మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అంపైర్ల తప్పిదాలను ప్రస్తావించింది. చెత్త అంపైరింగ్ అని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. మరోసారి బంగ్లాదేశ్ వచ్చే ముందు అంపైర్లతో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకొని వస్తామని సెటైర్లు వేసింది. బంతి తన బ్యాట్‌కు తగిలిందని అలాంటప్పుడు లెగ్ బైస్‌లో ఔట్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

కాగా భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌లో థర్డ్ అంపైర్ సమీక్ష నిబంధనను తొలగించారు. దీంతో హర్మన్‌కు సమీక్షకు వెళ్లే అవకాశం కూడా లేకుండాపోయింది. ఐసీసీ నిబంధనల ప్రకారం మైదానంలో తప్పుగా ప్రవర్తించినందుకు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత, మూడు డీమెరిట్ పాయింట్లు.. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లో అంపైర్ల నిర్ణయాలను తప్పుబట్టి నందుకుగాను ఓ డీమెరిట్ పాయింట్‌, మ్యాచ్ ఫీజులో మరో 25 శాతం కోత విధిస్తారు. ఈ లెక్కన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఐసీసీ మొత్తం 75 శాతం మ్యాచ్ ఫీజ్ కోత, 4 డీమెరిట్ పాయింట్లు కేటాయించనుంది. కాగా దీనిపై ఐసీసీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. కాగా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహరించిన తీరుపై అంతటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-07-25T16:52:14+05:30 IST