Share News

Glenn Maxwell: అప్పటివరకు ఐపీఎల్ ఆడతా.. మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-12-06T14:45:16+05:30 IST

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెయిన్ మ్యాక్స్‌వెల్ తనకు ఐపీఎల్‌పై ఉన్న అభిమానాన్ని వెల్లడించాడు. తానిక నడవలేనని నిర్దారణకు వచ్చే వరకు ఐపీఎల్ ఆడతానని మ్యాక్స్‌వెల్ చెప్పాడు. బిగ్‌బాష్ లీగ్ 13వ సీజన్ కోసం మెల్‌‌బోర్న్ వెళ్లిన మ్యాక్స్‌వెల్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్‌లో ఐపీఎల్ ఎలాంటి ప్రభావం చూపిందో వెల్లడించాడు.

Glenn Maxwell: అప్పటివరకు ఐపీఎల్ ఆడతా.. మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెయిన్ మ్యాక్స్‌వెల్ తనకు ఐపీఎల్‌పై ఉన్న అభిమానాన్ని వెల్లడించాడు. తానిక నడవలేనని నిర్దారణకు వచ్చే వరకు ఐపీఎల్ ఆడతానని మ్యాక్స్‌వెల్ చెప్పాడు. బిగ్‌బాష్ లీగ్ 13వ సీజన్ కోసం మెల్‌‌బోర్న్ వెళ్లిన మ్యాక్స్‌వెల్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్‌లో ఐపీఎల్ ఎలాంటి ప్రభావం చూపిందో వెల్లడించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌పై ప్రశంసలు కురిపించిన మ్యాక్సీ.. కెరీర్‌లో తాను ఆడే చివరి టోర్నమెంట్ ఐపీఎల్ అని పేర్కొన్నాడు. ‘‘ఐపీఎల్ నాకు చాలా మేలు చేసింది. సీనియర్ ఆటగాళ్లు, కోచ్‌లు, అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడడం వల్ల నా కెరీర్ మారిపోయింది. దాదాపు రెండు నెలలపాటు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ వంటి మేటి ఆటగాళ్లతో కలిసి ఆడడం వల్ల నా ఆటను ఎంతో మెరుగుపరచుకున్నాను. ఏ ఆటగాడైనా నేర్చుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచకప్ జరిగే వెస్టిండీస్‌లోని పరిస్థితులు భారత్‌లో మాదిరిగానే ఉంటాయి. అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. నేను ఆడే చివరి టోర్నమెంట్ ఐపిఎల్ కావొచ్చు. నేను ఇకపై నడవలేను అనేంత వరకు ఐపిఎల్ ఆడతాను. నా కెరీర్ మొత్తంలో ఐపీఎల్ నాకు ఎంతో మేలు చేసింది.’’ అని చెప్పాడు.


కాగా ఐపీఎల్‌లో మొదట పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. ఆర్సీబీతో మ్యాక్స్‌వెల్ ప్రయాణం 2021 సీజన్ నుంచి ప్రారంభమైంది. ఆ సీజన్‌లో మ్యాక్సీని బెంగళూరు రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. తక్కువ కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. 2021లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో 513 పరుగులతో సత్తా చాటాడు. స్ట్రైక్‌రేట్ 144గా ఉంది. ఆ తర్వాత 2022 సీజన్‌కు మ్యాక్సీని బెంగళూరు రూ.11 కోట్లకు రిటైన్ చేసుంది. 2023లో 14 మ్యాచ్‌ల్లో 400 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. కాగా 2024 ఐపీఎల్ సీజన్‌కు కూడా మ్యాక్సీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రిటైన్ చేసుకుంది. తన కెరీర్‌లో 124 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్ 26 సగటుతో 2719 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలున్నాయి. స్ట్రైక్ రేటు 157గా ఉంది. అలాగే 31 వికెట్లు కూడా తీశాడు.

Updated Date - 2023-12-06T14:45:18+05:30 IST