Asia Cup 2023: ఫ్యాన్ మేడ్ టీమ్.. కెప్టెన్‌గా ధావన్.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2023-08-23T17:06:55+05:30 IST

ఆసియా కప్ కోసం పలువురు అభిమానులు సెలక్టర్లు ఎంపిక చేసిన టీమిండియాకు ధీటుగా తమకు నచ్చిన టీమ్‌ను ఎంపిక చేశారు. ఫ్యాన్ మేడ్ టీమ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ టీమ్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నారు

Asia Cup 2023: ఫ్యాన్ మేడ్ టీమ్.. కెప్టెన్‌గా ధావన్.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్

ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌ మీదే ఉంది. ఇటీవల టీమిండియాను ప్రకటించిన తర్వాత సెలక్టర్లపై ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఒక్క అంతర్జాతీయ వన్డే కూడా ఆడని తిలక్ వర్మను ఎంపిక చేయడం సాహసోపేతంగా నిలిచింది. అదే సమయంలో వన్డేల్లో ఫామ్‌లో లేని సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్ట్ చేసి సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడం విమర్శలకు తావిచ్చింది. ట్రావెలింగ్ స్టాండ్ బైగా సంజు శాంసన్‌ను ఎంపిక చేసినా అది నామామాత్రమే అని తెలుస్తోంది. దీంతో పలువురు అభిమానులు సెలక్టర్లు ఎంపిక చేసిన టీమ్‌కు ధీటుగా తమకు నచ్చిన టీమ్‌ను ఎంపిక చేశారు. ఫ్యాన్ మేడ్ టీమ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఫ్యాన్ మేడ్ టీమ్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నారు. అతడు గతంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో శ్రీలంక పర్యటనలో కెప్టెన్‌గా వ్యవహరించి టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు. వన్డేల్లో ఒకప్పుడు రోహిత్ శర్మకు సరిజోడీ కూడా. ఐపీఎల్‌లో రాణించినా ధావన్‌ను సెలక్షన్ కమిటీ పట్టించుకోవడం లేదు. దీంతో అభిమానులు ఆసియా కప్‌కు తమ కెప్టెన్‌గా పిక్ చేశారు. ఓపెనర్లుగా ధావన్, రుతురాజ్ గైక్వాడ్.. వన్‌డౌన్‌లో యషస్వీ జైశ్వాల్, ఆ తర్వాత సంజు శాంసన్, రింకూ సింగ్, శివం దూబెలను ఎంచుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, చాహల్‌ను తీసుకోగా పేసర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.

ఇది కూడా చదవండి: Sanju Samson: ఐర్లాండ్‌లో ప్రత్యేకంగా ‘జైలర్’ సినిమా చూసిన టీమిండియా ఆటగాడు

కాగా ఫ్యాన్ మేడ్ టీమ్‌ను చూసిన టీమిండియా అభిమానులు అసలు టీమ్ కంటే ఈ టీమ్ చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. సీనియర్ టీమ్‌కు ఈ జట్టు ఎంతమాత్రం తీసిపోదని అంటున్నారు. సీనియర్ టీమ్, జూనియర్ టీమ్ మధ్య 10 మ్యాచ్‌లు జరిపితే కచ్చితంగా ఈ టీమ్ ఐదు కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలుస్తుందన్న విశ్వాసం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ధావన్ కెప్టెన్సీలో ఈ జట్టు ఎంతో సులభంగా బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ ,శ్రీలంక, పాకిస్తాన్ జట్లను ఓడించగలదని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లలో ఈ టీమ్ రాణించలేదని.. యువ ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం మైనస్ అవుతుందని కొందరు తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు.

Updated Date - 2023-08-23T17:07:18+05:30 IST