Sanju Samson: ఐర్లాండ్‌లో ప్రత్యేకంగా ‘జైలర్’ సినిమా చూసిన టీమిండియా ఆటగాడు

ABN , First Publish Date - 2023-08-23T15:33:39+05:30 IST

రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఇండియాలో అన్ని భాషల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ మూవీని ఐర్లాండ్‌లోనూ ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీంతో ఐర్లాండ్‌లోనే ఉన్న టీమిండియా యువ ఆటగాడు సంజు శాంసన్ జైలర్ మూవీ ప్రదర్శనకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు.

Sanju Samson: ఐర్లాండ్‌లో ప్రత్యేకంగా ‘జైలర్’ సినిమా చూసిన టీమిండియా ఆటగాడు

జస్‌ప్రీత్ బుమ్రా ఆధ్వర్యంలోని యువ టీమిండియా బుధవారం నాడు ఐర్లాండ్‌తో మూడో టీ20లో తలపడనుంది. అయితే మూడో టీ20 ఆరంభానికి ముందే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంతో టీమిండియా ఉత్సాహంతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు మొత్తం సరదాగా గడుపుతోంది. తాజాగా రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఇండియాలో అన్ని భాషల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాటలో పయనిస్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే.. జైలర్ మూవీని ఐర్లాండ్‌లోనూ ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీంతో ఐర్లాండ్‌లోనే ఉన్న టీమిండియా యువ ఆటగాడు సంజు శాంసన్ జైలర్ మూవీ ప్రదర్శనకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ కామెంటేటర్ నీల్ ఓబ్రెయిన్ వెల్లడించాడు.

కాగా సంజు శాంసన్ హీరో రజినీకాంత్‌కు పెద్ద అభిమాని. గతంలో రజినీకాంత్‌ను స్వయంగా కలిసిన సంజు శాంసన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ప్రత్యేకంగా పంచుకున్నాడు. తాను చిన్నప్పటి నుంచే రజినీకాంత్‌కు పెద్ద అభిమానిని అని.. ఏడేళ్ల వయసులోనే తాను ఎప్పటికైనా అభిమాన హీరోను కలుస్తానని తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిపాడు. తాను అనుకున్నట్లుగానే 21 ఏళ్ల తర్వాత తలైవర్ తనను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించారని.. దీంతో తన కల నెరవేరిందని సంజు శాంసన్ రజినీకాంత్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. అందుకే ఇప్పుడు జైలర్ మూవీ ప్రదర్శనకు సంజును ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: టీమిండియా ఎంపికపై వివాదాలు ఆపండి.. విమర్శలపై గవాస్కర్ ఆగ్రహం

కాగా త్వరలో శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్‌‌కు సంజు శాంసన్ స్టాండ్ బైగా ఎంపికయ్యాడు. అయినా అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు దాదాపుగా లేవు. ఒకవేళ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లలో ఎవరైనా గాయపడితే తప్ప సంజు శాంసన్‌కు తుది జట్టులో ఆడే అవకాశాలు ఉండవు. అటు వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో విఫలమైన సంజు శాంసన్ ఐర్లాండ్‌లో తన సత్తా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చినా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది. రెండో టీ20లో మాత్రం సంజు శాంసన్ 40 పరుగులతో రాణించాడు. మరి మూడో టీ20లో తుది జట్టులో సంజు శాంసన్ ఉంటాడా లేకపోతే అతడి స్థానంలో జితేష్ శర్మను ఆడిస్తారా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Updated Date - 2023-08-23T15:33:39+05:30 IST