Team India: వన్డే ప్రపంచకప్ జట్టులో కీలక మార్పు.. సీనియర్ ఆటగాడికి చోటు

ABN , First Publish Date - 2023-09-28T20:15:30+05:30 IST

టీమిండియా ప్రపంచకప్‌ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం నుంచి స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో టీమిండియా అతడిని పక్కకు తప్పించింది. అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Team India: వన్డే ప్రపంచకప్ జట్టులో కీలక మార్పు.. సీనియర్ ఆటగాడికి చోటు

వన్డే ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకోవడానికి ఐసీసీ అన్ని జట్లకు ఈనెల 28వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రపంచకప్‌ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం నుంచి స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో టీమిండియా అతడిని పక్కకు తప్పించింది. అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో టీమిండియా సీనియర్ ఆటగాడు అశ్విన్‌ తన కెరీర్‌లో మూడో వన్డే ప్రపంచకప్ ఆడబోతున్నాడు. 2011, 2015 వన్డే ప్రపంచకప్‌ల తర్వాత ఇప్పుడు 2023 ప్రపంచకప్ జట్టులో అతడు స్థానం సంపాదించాడు.

ఇది కూడా చదవండి: ODI World Cup 2023: మెగా టోర్నీకి దూరమవుతున్న స్టార్ ఆటగాళ్లు వీళ్లే..!!

కాగా సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేసిన రవిచంద్రన్ అశ్విన్‌.. రెండు మ్యాచ్‌లలో కలిపి 4 వికెట్లు తీశాడు. దీంతో వన్డేల్లోనూ సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. నిజానికి అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్‌ను తీసుకుంటున్నట్లు మూడో వన్డేలోనే కెప్టెన్ రోహిత్ శర్మ హింట్ ఇచ్చాడు. అశ్విన్ క్లాస్‌ బౌలర్‌ అని.. ఒత్తిడిని అధిగమించి ఎలా ఆడాలో తెలిసిన అనుభవజ్ఞుడు అని కొనియాడాడు. గతేడాది కాలంగా వన్డేలు ఆడనప్పటికీ గత రెండు మ్యాచ్‌లతో తన బౌలింగ్‌ స్థాయి ఏమిటో చాటిచెప్పాడని రోహిత్ వివరించాడు. అశ్విన్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అటు ఆసియా వన్డే కప్‌-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన అక్షర్‌ పటేల్‌ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పాటు మెగా టోర్నీకి దూరమయ్యాడు. అక్షర్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.

Updated Date - 2023-09-28T20:17:20+05:30 IST