Jasprit Bumrah: బుమ్రా విషయంలో టీమిండియాకు షాక్!

ABN , First Publish Date - 2023-02-10T19:14:49+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా బౌలర్లు ఇరగ దీయడంతో

 Jasprit Bumrah: బుమ్రా విషయంలో టీమిండియాకు షాక్!

న్యూఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా బౌలర్లు ఇరగ దీయడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)తో ఇటు బౌలింగులో 5 వికెట్ల ప్రదర్శన చేయడంతోపాటు బ్యాటింగ్‌లోనూ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జడేజా 66 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సెంచరీతో రాణించాడు. కాగా, తొలి టెస్టులో కంగారూలను కలవరపెడుతున్న భారత్‌ను ఓ వార్త షాక్‌కు గురిచేసింది. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వస్తాడనుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ సిరీస్ మొత్తానికి దూరమైనట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో బుమ్రా విషయంలో రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ(BCCI) నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు బుమ్రాకు మరింత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడీ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడించడం ద్వారా అతడిని ఒత్తిడికి గురిచేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న బుమ్రా.. పూర్తిస్థాయిలో బౌలింగ్ వేస్తున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

టెస్టు సిరీస్‌ నుంచి బుమ్రాకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్న బీసీసీఐ వచ్చే నెల 17 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో మాత్రం ఆడించాలని యోచిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. గతేడాది ఆగస్టులో విండీస్ టూర్ సందర్భంగా వెన్నెముక గాయంతో బాధపడిన బుమ్రా సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ కోసం జట్టులోకి వచ్చాడు. అయితే, గాయం మరోమారు తిరగబెట్టడంతో మరో రెండు నెలలు విశ్రాంతి అవసరమని తేల్చారు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా అతడిని పేరును పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, ఈసారి కూడా గాయం అతడిని జట్టుకు దూరం చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.

బుమ్రా దూరం కావడంతో మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ టీమిండియా పేస్ దళాన్ని నడిపిస్తున్నారు. బెంచ్‌లో జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.

Updated Date - 2023-02-10T19:14:51+05:30 IST