Share News

IND vs NED: ఊచకోత కోసిన టీమిండియా బ్యాటర్లు.. నెదర్లాండ్స్ ముందు భారీ లక్ష్యం

ABN , First Publish Date - 2023-11-12T17:59:53+05:30 IST

IND vs NED: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఊచకోత కోశారు. మొదటి నుంచి ఐదో బ్యాటర్ దాకా.. ప్రతి ఒక్కరూ మైదానంలో విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా.. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) అయితే పరుగుల సునామీ సృష్టించారు.

IND vs NED: ఊచకోత కోసిన టీమిండియా బ్యాటర్లు.. నెదర్లాండ్స్ ముందు భారీ లక్ష్యం

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఊచకోత కోశారు. మొదటి నుంచి ఐదో బ్యాటర్ దాకా.. ప్రతి ఒక్కరూ మైదానంలో విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా.. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) అయితే పరుగుల సునామీ సృష్టించారు. ఇద్దరూ అద్భుత శతకాలు నమోదు చేశారు. దీంతో.. టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు ఓవర్ల నష్టానికి 410 పరుగులు చేసింది. వరల్డ్ కప్‌లో భారత్‌కి ఇదే హయ్యస్ట్ స్కోరు.


తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంపిక చేసుకొని రంగంలోకి దిగింది. ఎప్పట్లాగే రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51) జట్టుకి శుభారంభాన్ని అందించారు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే వీళ్లు నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 11.5 ఓవర్లలోనే టీమిండియా 100 పరుగుల మైలురాయిని అందుకుందంటే.. ఏ రేంజ్‌లో ఆ ఇద్దరూ విధ్వంసం సృష్టించారో మీరే అర్థం చేసుకోండి. అయితే.. సరిగ్గా 100 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు. ఆ కాసేపటికే రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. అప్పుడు కోహ్లీ, శ్రేయస్ కలిసి ఆచితూచి ఆడారు. మరో వికెట్ పడితే జట్టు ఒత్తిడిలో పడుతుందని భావించి.. నిదానంగా రాణించారు. ఇక క్రీజులో కుదురుకున్నాక.. ఇద్దరూ విజృంభించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కోహ్లీ అర్థశతకం (51) పూర్తి చేసుకున్నాడు.

కోహ్లీ దూకుడు చూసి.. ఆ అర్థశతకాన్ని సెంచరీగా మలుస్తాడని అంతా అనుకున్నారు కానీ, అనుకోకుండా అతడు బౌల్డ్ అయ్యాడు. కేఎల్ రాహుల్ మైదానంలోకి అడుగుపెట్టాక.. అసలు కథ మొదలైంది. ఓవైపు శ్రేయస్, మరోవైపు రాహుల్.. ఇద్దరూ ఎడాపెడా షాట్లతో నెదర్లాండ్స్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించారు. సెంచరీ దగ్గర శ్రేయస్ కాస్త నెమ్మదించినా.. సెంచరీ చేశాక సిక్సులతో చెలరేగిపోయాడు. అటు.. కేఎల్ రాహుల్ కూడా అర్థశతకం చేసిన తర్వాత పూనకం వచ్చినట్లు భారీ షాట్లతో దుమ్ముదులిపేశాడు. దీంతో.. 62 బంతుల్లోనే సెంచరీ చేయగలిగాడు. చివర్లో భారీ షాట్ కొట్టబోయి.. అతడు ఔట్ అయ్యాడు. వీళ్లిద్దరు నాలుగో వికెట్‌కి ఏకంగా 208 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక ఈ మ్యాచ్ గెలవాలంటే.. నెదర్లాండ్స్ 411 పరుగులు చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2023-11-12T17:59:55+05:30 IST