IND vs AUS: కోహ్లీ అవుట్‌పై వివాదం.. వసీం జాఫర్ ఒక్క ముక్కలో తేల్చేశాడు!

ABN , First Publish Date - 2023-02-18T16:52:32+05:30 IST

పర్యాటక జట్టుకు పోటీ ఇచ్చింది. తొలుత కోహ్లీ(Virat Kohli), ఆ తర్వాత అక్షర్ పటేల్(Axar Patel) జట్టును ఆదుకున్నారు.

IND vs AUS: కోహ్లీ అవుట్‌పై వివాదం.. వసీం జాఫర్ ఒక్క ముక్కలో తేల్చేశాడు!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా(Australia)తో ఇక్కడి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో తొలుత వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టు ఆ తర్వాత కోలుకుంది. పర్యాటక జట్టుకు పోటీ ఇచ్చింది. తొలుత కోహ్లీ(Virat Kohli), ఆ తర్వాత అక్షర్ పటేల్(Axar Patel) జట్టును ఆదుకున్నారు. క్రీజులో కుదురుకున్న కోహ్లీ 135 పరుగుల వద్ద మాథ్యూ కునేమన్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయి పెవిలియన్ చేరాడు. 84 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 4 ఫోర్లతో 44 పరుగులు చేశాడు.

కోహ్లీ అవుట్‌పై ఇప్పుడు వివాదం చెలరేగింది. కోహ్లీది అసలు అవుట్ కానే కాదంటూ నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాథ్యూ వేసిన బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాట్ ప్యాడ్‌కు తాకినట్టు భావించిన బౌలర్ అప్పీల్ చేయగానే అంపైర్ వేలు పైకెత్తాడు. అయితే, బంతి ప్యాడ్‌ను తాకడానికి ముందు బ్యాట్‌కు తగలడంతో కోహ్లీ రివ్యూకు వెళ్లాడు. అయితే, రివ్యూ బౌలర్‌కే అనుకూలంగా వచ్చింది. రిప్లేలో మాత్రం బంతి తొలుత బ్యాట్‌ను తాకి ఆపై ప్యాడ్స్‌ను తాకినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ నిర్ణయం బౌలర్‌కే అనుకూలంగా రావడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్(Wasim Jaffer) కూడా అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అది అవుటంటే తాను నమ్మలేకపోతున్నానంటూ ఫొటోను షేర్ చేశాడు. అది అవుట్ కానే కాదని తేల్చి చెప్పాడు. అభిమానులు కూడా అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. మరీ ఇంత చెత్త అంపైరింగ్ ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-18T16:52:34+05:30 IST