Share News

ODI World Cup: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ రెండు స్టేడియాల్లో ఫైర్ వర్క్స్‌పై నిషేధం

ABN , First Publish Date - 2023-11-01T15:07:23+05:30 IST

వాతావరణ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై, ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లలో బాణసంచా కాల్చడంపై బీసీసీఐ నిషేధం విధించింది.

ODI World Cup: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ రెండు స్టేడియాల్లో ఫైర్ వర్క్స్‌పై నిషేధం

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో అదరహో అనిపిస్తోంది. ఇప్పటివరకు రోహిత్ సేన ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఆరు వేర్వేరు స్టేడియాల్లో ఆయా మ్యాచ్‌లను నిర్వహించారు. అయితే ప్రతి స్టేడియంలో టీమిండియా విజయం సాధించగానే బాణసంచా కాలుస్తూ విజయోత్సవ సంబరాలను క్రికెట్ అభిమానులు జరుపుకుంటున్నారు. కళ్లు మెరుమెట్లు గొలిపేలా ఫైర్ వర్క్స్‌ ఈవెంట్‌ను బీసీసీఐ నిర్వహిస్తోంది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది. కానీ వచ్చే రెండు మ్యాచ్‌లకు మాత్రం ఫైర్ వర్క్స్ ఉండవని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు.

టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడనుంది. అయితే ముంబైలోని వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాము బాణసంచా కాల్చడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ఇప్పటికే ముంబైలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అక్కడ రోజురోజుకు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో బాణసంచా కాల్చితే వాయు కాలుష్యం మరింత పెరుగుతుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా తెలిపారు. మరోవైపు ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లోనూ ఫైర్ వర్క్స్ ఉండవని స్పష్టం చేశారు. ఢిల్లీలో కూడా వాయు కాలుష్యం భారీ స్థాయిలో ఉండటం వల్ల తాము బాణసంచా కాల్చే కార్యక్రమాన్ని పక్కనపెట్టామని పేర్కొన్నారు. అభిమానులు, ఆటగాళ్లు, ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని.. అందులో భాగంగానే ఫైర్ వర్క్స్ నిలిపివేస్తున్నామని జై షా వెల్లడించారు.

Updated Date - 2023-11-01T15:07:23+05:30 IST