Ahmedabad Test: నాలుగో టెస్టు ముందు టీమిండియాకు రికీ పాంటింగ్ అద్భుత సలహా!

ABN , First Publish Date - 2023-03-07T16:13:55+05:30 IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల

Ahmedabad Test: నాలుగో టెస్టు ముందు టీమిండియాకు రికీ పాంటింగ్ అద్భుత సలహా!

అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 9న చివరిదైన నాలుగో టెస్టు ప్రారంభం కాబోతోంది. తొలి రెండు టెస్టుల్లోనూ విజయం సాధించిన భారత జట్టు మూడో టెస్టులో ఓడింది. ఫలితంగా భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఈ టెస్టులో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను గెలుచుకోవడంతోపాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ అడుగుపెట్టాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, నాలుగో టెస్టు(Ahmedabad Test)లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పర్యాటక జట్టు పట్టుదలగా ఉంది.

రాహుల్ వర్సెస్ గిల్

ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌(KL Rahul)ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు మూడో టెస్టులో అతడిని తప్పించిన సెలక్టర్లు యువ ఆటగాడు శుభమన్ గిల్‌(Shubman Gill)కు చోటిచ్చారు. అయితే, ఆ టెస్టులో గిల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 21, రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో ఎవరిని ఆడించాలంటూ జరుగుతున్న చర్చలోకి ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) ఎంటరయ్యాడు.

ఇద్దరినీ ఆడించడమే బెటర్

ఐసీసీ రివ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ.. ఒకరిని పక్కనపెట్టి, మరొకరికి జట్టులో చోటివ్వడం కాకుండా రాహుల్, గిల్ ఇద్దరినీ ఒకేసారి ఆడించాలని సలహా ఇచ్చాడు. శుభమన్ గిల్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, రాహుల్‌‌ను మిడిలార్డర్‌లో దించితే బాగుంటుందన్నాడు. గతంలో ఇంగ్లండ్‌లో ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఆడినట్టు గుర్తు చేశాడు. ఇంగ్లండ్ కండిషన్లకు అలవాటు పడిన ఆటగాళ్లను భారత, ఆస్ట్రేలియా తుది జట్టులోకి తీసుకోవాలని పాంటింగ్ సూచించాడు.

Updated Date - 2023-03-07T16:52:09+05:30 IST