Virat Kohli: కింగ్ కోహ్లీ కెరీర్‌కు 15 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడింది ఈరోజే..!!

ABN , First Publish Date - 2023-08-18T13:09:56+05:30 IST

కింగ్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు వెనుతిరిగి చూసుకోలేదు. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 500 మ్యాచ్‌లకు పైగా ఆడాడు.

Virat Kohli: కింగ్ కోహ్లీ కెరీర్‌కు 15 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడింది ఈరోజే..!!

ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీ అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రికార్డులకు రారాజులా బంతిని బాదడం విరాట్‌కు వెన్నతో పెట్టిన విద్య. సచిన్ రికార్డులను అందుకోవడం దాదాపు అసాధ్యం అని భావించిన సమయంలో కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొట్టి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అందుకే అభిమానులందరూ అతడిని ముద్దుగా కింగ్ అని పిలుస్తుంటారు. కింగ్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు వెనుతిరిగి చూసుకోలేదు. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 500 మ్యాచ్‌లకు పైగా ఆడాడు.

విరాట్ కోహ్లీ కెరీర్ వన్డేలతో ప్రారంభమై.. టెస్టులు, టీ20లకు పాకింది. టెస్టుల్లో 111 మ్యాచ్‌లు, వన్డేల్లో 275 మ్యాచ్‌లు, టీ20ల్లో 115 మ్యాచ్‌లు ఆడి 25వేలకు పైగా పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలో 76 సెంచరీలు పూర్తి చేశాడు. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేదు. శ్రీలంకతో ఆడిన తొలి మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కానీ అతడికి మంచి కెరీర్ ఉందని చాలా మంది అంచనా వేశారు. అంచనాలకు తగ్గట్లుగానే కోహ్లీ అతి తక్కువ కాలంలోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. 15 ఏళ్ల కాలంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. వన్డేల్లో 46 సెంచరీలు, టెస్టుల్లో 29 సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ సాధించాడు. బౌలర్‌గా టెస్టులు, వన్డేల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు.

ఇది కూడా చదవండి: Jasprit Bumrah: బుమ్రా గాయానికి శృంగారమే కారణమా? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ

ఆటగాడిగా 2011లో వన్డే ప్రపంచకప్ అందుకున్న విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా పెద్దగా రాణించలేకపోయాడు. తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా అందించలేకపోయాడు. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌లో తనదైన శైలిలో రాణించి భారత్‌కు మూడో వన్డే ప్రపంచకప్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఇటీవల తన అంతర్జాతీయ కెరీర్‌లో 500వ మ్యాచ్ ఆడిన కోహ్లీ.. ఇప్పటికీ తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం బాదిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

Updated Date - 2023-08-18T13:09:56+05:30 IST