Asian Games 2023: 7వ రోజు పతకాల వేట షురూ.. మరోసారి సత్తా చాటిన షూటర్లు

ABN , First Publish Date - 2023-09-30T10:33:59+05:30 IST

ఆసియా క్రీడలు 2023లో 7వ రోజు భారత్ పతకాల వేట ప్రారంభమైంది. షూటింగ్‌లో మరోసారి సత్తా చాటిన భారత్ ఖాతాలో సిల్వర్ మెడల్ చేరింది.

Asian Games 2023: 7వ రోజు పతకాల వేట షురూ.. మరోసారి సత్తా చాటిన షూటర్లు

హాంగ్జౌ: ఆసియా క్రీడలు 2023లో 7వ రోజు భారత్ పతకాల వేట ప్రారంభమైంది. షూటింగ్‌లో మరోసారి సత్తా చాటిన భారత్ ఖాతాలో సిల్వర్ మెడల్ చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ భారత్ ద్వయం సరబ్‌జోత్ సింగ్, దివ్య తాడిగోల్ రజత పతకం గెలిచారు. ఫైనల్ పోరులో 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత జోడి రజతంతో సరిపెట్టుకుంది. 16 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచిన బోవెన్ జాంగ్ రాంక్సిన్ జియాంగ్‌లతో కూడిన చైనా జోడి బంగారు పతకం కైవసం చేసుకుంది. 7వ రోజు భారత్‌కు ఇదే తొలి పతకం. మొత్తంగా భారత్‌కు ఇది 34వ పతకం. ఇందులో షూటింగ్‌లోనే 19 పతకాలు రావడం గమనార్హం. అందులో 6 గోల్డ్, 8 సిల్వర్, 5 కాంస్య పతకాలున్నాయి.


కాగా ఆసియా క్రీడల ఆరో రోజు భారత్‌కు పతకాలు వెల్లువెత్తాయి. ఆరో రోజు మొత్తం ఎనిమిది పతకాలు మనకు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇక ఆరో రోజు గురి తప్పని షూటర్ల తూటాలు పతకాలు కురిపించాయి. మహిళల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో పాలక్‌ గులియా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇషాసింగ్‌ రజత పతకం సొంతం చేసుకుంది. అలాగే ఇషా-పాలక్‌-దివ్య త్రయం మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో రజత పతకం సాధించింది. పురుషుల 50మీ. రైఫిల్‌ త్రీ పొజిషన్‌ టీమ్‌ కేటగిరీలో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ టోమర్‌, స్వప్నిల్‌ కుశాలే, అఖిల్‌ షెరాన్‌ బృందం ఏకంగా వరల్డ్‌ రికార్డుతో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది.

Updated Date - 2023-09-30T10:37:20+05:30 IST