Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్! ఏ ఆటలో అంటే..?

ABN , First Publish Date - 2023-09-25T08:37:34+05:30 IST

ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్! ఏ ఆటలో అంటే..?

చైనా: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ప్రపంచ ఛాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్, ఒలింపియన్ దివ్యాన్ష్ పన్వర్, ఐశ్వరీ తోమర్‌తో కూడిన జట్టు బంగారు పతకాన్ని గెలిచింది. బంగారు పతాకాన్ని సాధించడమే కాకుండా క్వాలిఫికేషన్ రౌండ్‌లో సాధించిన పాయింట్స్ ద్వారా ప్రపంచ రికార్డును కూడా బద్దలుకొట్టింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో భారత పురుషుల జట్టు ఏకంగా 1893.7 పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో చైనా నెలకొల్పిన 1893.3 పాయింట్ల రికార్డు బద్దలైంది. అలాగే పురుషుల ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లో భారత్ ఖాతాలో కాంస్య పతకం చేరింది. జస్విందర్, భీమ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన జట్టు 6:10.81 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసి కాంస్య పతకాన్ని సాధించింది.


కాగా ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి రోజు 5 పతకాలు చేరాయి. షూటింగ్‌లో రజత, కాంస్య పతకాలు దక్కగా.. రోయర్లకు రెండు రజతాలు, ఓ కాంస్య పతకం దక్కింది. ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని షూటర్లు అందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రమిత జిందాల్‌, మెహులీ ఘోష్‌, ఆషి చోక్సీలతో కూడిన భారత త్రయం రజత పతకం సాధించింది. అనుభవం ఉన్న మన జట్టు పసిడి సాధిస్తుందనే అంచనాలున్నా.. 1886 పాయింట్ల స్కోరుతో రెండో స్థానానికి పరిమితమైంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రమిత 631.9, మెహులీ 630.8, చోక్సీ 623.3 పాయింట్లు స్కోరు చేశారు. ఓవరాల్‌గా రెండో స్థానంతో పతకం దక్కించుకున్నారు. 1896.60 పాయింట్లతో స్వర్ణం నెగ్గిన చైనా టీమ్‌ ఆసియా క్రీడల రికార్డును అధిగమించింది. మంగోలియా కాంస్యం దక్కించుకొంది. టీమ్‌ ఈవెంట్‌లో రజతం నెగ్గిన రమిత.. 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లోనూ పతకంతో మెరిసింది. ఫైనల్లో రమిత 230.1 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకొంది. చైనా షూటర్లలో హువాంగ్‌ యుటిన్‌ (252.7 పాయింట్లు) ఆసియా రికార్డుతో స్వర్ణం నెగ్గగా.. హన్‌ జియాయు (251.3) రజతం దక్కించుకొంది. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్‌ మెహులీ (208.43) నాలుగో స్థానంతో నిరాశపర్చింది.

ఇక భారత రోయర్లు అంచనాలకు తగ్గట్టే రాణించారు. పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ ఫైనల్లో అర్జున్‌ లాల్‌ జాట్‌-అరవింద్‌ సింగ్‌ జంట 6:28.18 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. చైనా ద్వయం 6:23.16 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం నెగ్గగా.. ఉజ్బెకిస్థాన్‌ జోడీ 6:33.42 సెకన్లతో కాంస్యం దక్కించుకొంది. ఇక, కాక్స్‌డ్‌ ఎయిట్‌ టీమ్‌ ఈవెంట్‌లో చైనాకు గట్టిపోటీ ఇచ్చిన భారత్‌... ఆఖరికి రజతంతో సరిపెట్టుకుంది. నీరజ్‌, నరేక్ష్‌ కల్వానియా, నీతిష్‌ కుమార్‌, చరణ్‌జీత్‌ సింగ్‌, జస్వీందర్‌ సింగ్‌, భీమ్‌ సింగ్‌, పునీత్‌ కుమార్‌, ఆశీష్‌లతో కూడిన భారత జట్టు 5:43.01 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలవగా.. చైనా 5:40.17 సెకన్లతో స్వర్ణం ఎగరేసుకుపోయింది. ఇండోనేసియా మూడో స్థానం దక్కించుకొంది. పురుషుల కాక్స్‌లెస్‌ పెయిర్‌ ఈవెంట్‌ ఫైనల్లో బాబులాల్‌ యాదవ్‌-లేఖ్‌ రామ్‌తో కూడిన భారత జంట 6:50.41 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం సాధించింది. హాంకాంగ్‌కు పసిడి, ఉజ్బెకిస్థాన్‌కు రజతం దక్కాయి. మొదటి రోజు పోటీల్లో ఆతిథ్య చైనా 20 స్వర్ణాలు సహా 30 పతకాలతో టాప్‌లో నిలవగా.. చెరో 14 పతకాలతో కొరియా (5 పసిడి), జపాన్‌ (2 స్వర్ణాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

Updated Date - 2023-09-25T08:49:50+05:30 IST