IND vs BAN: ప్రయోగాలకు వేళాయే.. కోహ్లీ, హార్దిక్ ఔట్.. సూర్య, శ్రేయస్‌కు చోటు!

ABN , First Publish Date - 2023-09-14T16:13:03+05:30 IST

ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ప్రపంచకప్‌నకు ముందు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకునేందుకు, అలాగే అందరికీ సరైన ప్రాక్టీస్ లభించేందుకు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వొచ్చు.

IND vs BAN: ప్రయోగాలకు వేళాయే.. కోహ్లీ, హార్దిక్ ఔట్.. సూర్య, శ్రేయస్‌కు చోటు!

కొలంబో: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరగనుంది. టీమిండియాకు ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు కాగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా రెండు జట్లకు వచ్చిన నష్టం ఏం లేదు. సూపర్ 4లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు టేబుల్ టాపర్‌గా నిలిచింది. బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి టేబుల్‌లో చిట్ట చివరన ఉంది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్ పోరుకు తగిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవంగా టోర్నీ నుంచి నిష్క్రమించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. కానీ ఇప్పుడున్న బలబలాల ప్రకారం చూస్తే బంగ్లాదేశ్‌ను ఓడించడం టీమిండియాకు పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 39 వన్డే మ్యాచ్‌లు జరగగా.. టీమిండియా ఏకంగా 31 గెలిచింది. బంగ్లాదేశ్ 7 మాత్రమే గెలవగా.. ఒక దాంట్లో ఫలితం తేలలేదు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ప్రపంచకప్‌నకు ముందు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకునేందుకు, అలాగే అందరికీ సరైన ప్రాక్టీస్ లభించేందుకు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వొచ్చు. దీంతో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ వంటి వాళ్లను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండే అవకాశాలున్నాయో ఒక సారి పరిశీలిద్దాం.


ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగడం ఖాయమని చెప్పుకోవాలి. అయితే విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకొవచ్చు. అప్పుడు శ్రేయస్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కాగా వెన్నునొప్పి తిరగబెట్టడంతో సూపర్ 4లో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన శ్రేయస్ అయ్యర్ కొలుకున్నాడు. నేడు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు. దీంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్, ఐదో స్థానంలో ఇషాన్ కిషన్ ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించొచ్చు. ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడాలని భావిస్తే మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా విశ్రాంతినిచ్చి అక్షర్ పటేల్‌ను కొనసాగిస్తారు. అలా కాకుండా గత మ్యాచ్‌లో మాదిరిగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ఇద్దరూ తుది జట్టులో ఉంటారు. ఇక బౌలింగ్ డిపార్ట్‌మెంట్ విషయానికొస్తే బుమ్రా, సిరాజ్‌లలో ఒకరికి విశ్రాంతినిచ్చి మహ్మద్ షమీని ఆడించే అవకాశాలున్నాయి. అయితే పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిస్తే ముగ్గురు పేసర్లు తుది జట్టులో ఉండడం ఖాయమని చెప్పుకోవాలి. ఇక ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నాడు. అయితే తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కూడా జట్టులో ఉన్నప్పటికీ వారిని ఆడించే అవకాశాలు లేవు. ఎందుకంటే వారిద్దరు వన్డే ప్రపంచకప్‌నకు ఎంపిక కాలేదు. దీంతో ప్రపంచకప్‌నకు ఎంపికైన వారికి ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో తిలక్, ప్రసిద్ధ్‌ను ఆడించే అవకాశాలు లేవు.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ/శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా/సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్/షమీ

Updated Date - 2023-09-14T16:13:03+05:30 IST