Viral News: అమెరికా మాజీ అధ్యక్షుడి పాత లేఖకు.. వేలంలో దిమ్మతిరిగే ధర..!
ABN , First Publish Date - 2023-07-05T13:58:35+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ (John Adams) ఆ దేశ చరిత్రలో ఓ కీలకమైన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Viral News: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ (John Adams) ఆ దేశ చరిత్రలో ఓ కీలకమైన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1735లో మసాచుసెట్స్ (Massachusetts) లో జన్మించిన ఆయన 1797 నుంచి 1801 వరకు యూఎస్ ప్రెసిడెంట్గా పని చేశారు. ఆయన అమెరికాకు రెండో అధ్యక్షుడు. అంతకు ముందు మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ (George Washington) హయాంలో ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ఇప్పుడు ఈ వివరాలు దేనికనేగా మీ అనుమానం అక్కడికే వస్తున్నాం. తాజాగా జాన్ ఆడమ్స్ రాసిన ఓ పాత లేఖ వేలంలో దిమ్మతిరిగే ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. డిసెంబర్ 14, 1824లో ఆయన ఈ లేఖను ఎలెన్ బ్రాకెట్ అనే నవ వధువుకు రాశారు. ఈ లేఖ ఇటీవల నిర్వహించిన ఓ వేలంలో ఏకంగా రూ.32 లక్షలు పలకడం విశేషం. ఇక ఆడమ్స్ ఆ లేఖలో కొత్తగా పెళ్లయిన జంట పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు వారు సుఖశాంతులతో హాయిగా జీవించాలని ఆకాంక్షించారు.
కాగా, ఈ లేఖ గడిచిన 200 ఏళ్లుగా ఫ్యామిలీ కలెక్షన్లో ఉంది. ఇటీవలే బయటపడింది. ఇది ఒక విలువైన చరిత్రను సైతం కలిగి ఉంది. దీన్ని ఆడమ్స్ మసాచుసెట్స్లోని తన ఇంటిలో ఉన్నప్పుడు రాయడం దీని ప్రత్యేకత. అయితే, ఇప్పుడు ఈ లేఖ వేలంలో భారీ ధర పలకడం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. జాన్ ఆడమ్స్ తన మిత్రుడు, రాజకీయ ప్రత్యర్థి అయిన థామస్ జెఫెర్సన్ (Thomas Jefferson) చనిపోయిన రోజునే 90 ఏళ్ల వయస్సులో మరణించారు. అయితే, జాన్ ఆడమ్స్ తన చివరి క్షణంలో జెఫెర్సన్ గురించే మాట్లాడారట. కానీ, ఆయనకు అప్పటికే జెఫెర్సన్ చనిపోయారనే విషయం తెలియదు. ఏదేమైనా అమెరికా రాజకీయ చరిత్రలో ఈ మాజీ అధ్యక్షుడి పేరు చిరకాలంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.