YSRCP : వైసీపీలో మరో ముసలం.. నెల్లూరు నుంచి ప్రకాశంకు పాకిన అసమ్మతి.. జగన్ దగ్గరే తేల్చుకోవాలని..

ABN , First Publish Date - 2023-02-05T19:55:35+05:30 IST

అధికార పార్టీ వైసీపీపై (YSR Congress) ఒకరి తర్వాత ఒకరు నేతలు అసంతృప్తి గళం వినిపిస్తూ రెబల్స్‌గా (Rebals) మారుతున్నారు. ఇప్పటి వరకూ ఎంపీ రఘురామకృష్ణంరాజు...

YSRCP : వైసీపీలో మరో ముసలం.. నెల్లూరు నుంచి ప్రకాశంకు పాకిన అసమ్మతి.. జగన్ దగ్గరే తేల్చుకోవాలని..

అమరావతి/ప్రకాశం : అధికార పార్టీ వైసీపీపై (YSR Congress) నేతలు ఒకరి తర్వాత ఒకరు అసంతృప్తి గళం వినిపిస్తూ రెబల్స్‌గా (Rebals) మారుతున్నారు. ఇప్పటి వరకూ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju), ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) రేపొద్దున ఈ నంబర్ మరింత పెరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఈ మధ్యనే ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయరెడ్డిపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇప్పుడేమో ఉమ్మడి ప్రకాశం (Prakasam) జిల్లాలో ఏకంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై (Sudhakar Babu) ఓ వర్గానికి చెందిన వైసీపీ నేతలు వ్యతిరేకం అయ్యారు. దీంతో రానున్న ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎమ్మెల్యే అనుచరుల్లో టెన్షన్ మొదలైంది.

Sudhakar-Babu-1.jpg

అప్పుడు అలా..!

గుంటూరు జిల్లాకు (Guntur) చెందిన సుధాకర్ బాబు.. గత ఎన్నికల సమయంలో పక్కనుండే ప్రకాశం (Prakasam) జిల్లాకు వెళ్లి సంతనూతలపాడు నియోజకవర్గం (Santhanuthalapadu) నుంచి పోటీచేశారు. వైసీపీ (YSRCP) గాలిలో సునాయసంగా సుధాకర్ గెలిచేశారు. ఇతర జిల్లాకు చెందిన నేత అయినప్పటికీ అక్కున చేర్చుకున్నారు నియోజకవర్గ ప్రజలు. రెండేళ్లపాటు సంతనూతలపాడులో ఎలాంటి గొడవలు లేకున్నా ఆ తర్వాత లుకలుకలు మొదలయ్యాయి. అవి కాస్త రచ్చ రచ్చగా మారడంతో నాడు మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasareddy) రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాతే పరిస్థితి చక్కబడింది.

Sudhakar.jpg

ఇప్పుడు ఇలా..!

ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేకు (MLA) వ్యతిరేకంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. సంతనూతలపాడులో తమకు అసలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తికి లోనవుతున్నారు ద్వితియశ్రేణి నేతలు. ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత విషయాన్ని జిల్లా ఇంచార్జ్ మంత్రికి, సీఎం జగన్‌‌కి (CM Jagan) చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలియవచ్చింది. రానున్న ఎన్నికల్లో అసలు సుధాకర్‌ బాబుకు టికెట్ ఇవ్వొద్దని.. ఇస్తే తప్పకుండా గుణపాఠం చెబుతామని జగన్ ముందే తేల్చుకోవాలని నియోజకర్గ నేతలు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Sudhakar-babu.jpg

మొత్తానికి చూస్తే.. అటు ఎమ్మెల్యేలు ఇటు కిందిస్థాయి కేడర్‌‌ వైసీపీపై అసమ్మతి గళం వినిపిస్తోంది. ఇలా రోజుకో నియోజకవర్గానికి చెందిన నేతలు మీడియా ముందుకొస్తుండటంతో అధికార పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికలు దగ్గరపడే కొద్ది ఇలా ఉంటే.. ఎలక్షన్ సీజన్ వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో..? వైసీపీ పెద్దలు ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటారో..? వేచి చూడాల్సిందే మరి.

Updated Date - 2023-02-05T20:14:45+05:30 IST