YS Sharmila: అందుకే ఎమ్మెల్సీ కవిత కొత్త డ్రామాలు ఆడుతున్నారు..!

ABN , First Publish Date - 2023-03-03T18:11:36+05:30 IST

లిక్కర్ స్కామ్ను పక్కదారి పట్టించేందుకే కవిత కొత్త డ్రామాలు ఆడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila: అందుకే ఎమ్మెల్సీ కవిత కొత్త డ్రామాలు ఆడుతున్నారు..!

ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు (YSR Telangana Party President) షర్మిలారెడ్డి (Sharmila Reddy) సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ను పక్కదారి పట్టించేందుకే కవిత కొత్త డ్రామాలు ఆడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లు అంటూ కవిత కొత్త రాగం అందుకోవడం విడ్డూరమని షర్మిల మండిపడ్డారు. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్లుంది కవిత తీరు ఉందని, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. మహిళలకు 33శాతం సీట్లు ఎందుకు కేటాయించలేదు? అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ తొలి కేబినెట్లో మహిళలకు చోటు లేదని, ప్రస్తుత కేబినెట్లో పట్టుమని ఇద్దరు మంత్రులు మాత్రమే ఉన్నారని ఆమె అన్నారు. ఇదేనా మహిళలపై మీకున్న మక్కువ? అని షర్మిల మండిపడ్డారు. కవిత దీక్ష చేయాల్సింది ప్రగతిభవన్ ముందు.. ఫామ్హౌజ్ ముందు బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్కు పాల్పడిన తమరు మహిళలకే తలవంపులు తెచ్చారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల బీజేపీ నేత వివేక్‌ (vivek) మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్‌ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) తరహాలో సీఎం కేసీఆర్‌ (CM KCR) కుమార్తె కవిత (Kavitha) కూడా అరెస్టవుతుందని జోస్యం చెప్పారు. అమ్‌ఆద్మీ పార్టీకి ఎన్నికల ఖర్చు కోసం రూ.150 కోట్లు కవిత ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ తరహాలో లిక్కర్‌ స్కాంను ఢిల్లీలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నించారన్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు బీఆర్‌ఎస్‌ను పెట్టి కేసీఆర్‌ దేశమంతా తిరుగుతున్నారన్నారని ఆయన విమర్శించారు. అసలు నిధులే లేకుండా ఏర్పడిన టీఆర్‌ఎస్‌ నేడు ధనిక పార్టీగా ఎలా మారిందని ప్రశ్నించారు. అదంతా ప్రజల సొమ్మే అన్నారు. ఇటీవల రూ.400 కోట్లతో ఓ విమానాన్ని కూడా కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెగా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే ధనికుడిగా చేసిన ఘనత కేసీఆర్‌కే చెందుతుందన్నారు. మహారాష్ట్ర, ఏపీ వంటి రాష్ట్రాల్లో అవుట్‌డేటెడ్‌ నాయకులను తీసుకుని బీఆర్‌ఎస్‌ పేరుతో తిరుగుతున్నారని వివేక్‌ దుయ్యబట్టారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ ఆదివారం మనీశ్‌ సిసోడియాను అరెస్టు చేసింది. సుమారు 8 గంటల పాటు ప్రశ్నించినా ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాలేదని సీబీఐ అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-03-03T20:32:18+05:30 IST