Pawan Delhi Tour : అమిత్ షాను కలవకుండానే హైదరాబాద్‌కు వెనుదిరిగిన పవన్.. ఢిల్లీలో అసలేం జరిగింది.. ఏదో అనుకుంటే..!

ABN , First Publish Date - 2023-04-04T22:52:51+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన (Pawan Kalyan Delhi Tour) ముగిసింది. రెండ్రోజులపాటు హస్తినలో పర్యటించిన పవన్..

Pawan Delhi Tour : అమిత్ షాను కలవకుండానే హైదరాబాద్‌కు వెనుదిరిగిన పవన్.. ఢిల్లీలో అసలేం జరిగింది.. ఏదో అనుకుంటే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన (Pawan Kalyan Delhi Tour) ముగిసింది. రెండ్రోజులపాటు హస్తినలో పర్యటించిన పవన్.. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ (Muralidharan), బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) , కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో (Gajendra Singh Shekhawat) సమావేశం అయ్యారు. అయితే ఆయన పవన్ పర్యటనతో ఎన్నో రోజులుగా అటు జనసేన (Janasena).. ఇటు బీజేపీ (BJP) కార్యకర్తల మదిలో నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు వస్తాయని ఎన్నెన్నో అనుకున్నారు. కార్యకర్తలు, వీరాభిమానులు ఆశించిన రీతిలో పవన్ పర్యటన జరగలేదని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా ఈ టూర్‌తో పొత్తులు (Alliance), రోడ్డు మ్యాప్ (Road Map), భవిష్యత్ కార్యాచరణ ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అభిమానులు ఆశించారు.. పవన్ కూడా ఎన్నెన్నో ఊహించుకుని పర్యటనకు వెళ్లారు కానీ అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయట. అసలు పవన్ ఎందుకు ఢిల్లీకెళ్లారు..? ఈ రెండ్రోజుల పర్యటనలో పవన్ ఏం చేశారనే విషయాలపై ప్రత్యేక కథనం.

Janasena-Pawan.jpg

పవన్ ఏమనుకున్నారు..?

పవన్ ఢిల్లీ పర్యటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అటు మీడియాలో (Telugu Media).. ఇటు సోషల్ మీడియాలో (Social Media) ఎక్కడ చూసినా పవన్ టూర్‌పైనే చర్చ నడిచింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Amit Shah) భేటీ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. సీన్ కట్ చేస్తే అవేమీ జరగలేదు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కలిసి పొత్తులు, వారాహితో నియోజకవర్గాల పర్యటన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని పవన్ భావించారట. అయితే ముందుగా అనుకున్నట్లుగా పవన్ పర్యటన హస్తినలో సాగలేదట. అమిత్ షాతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆయన బిజిబిజీ షెడ్యూల్‌తో కలవడానికి కుదరలేదట. దీంతో మూడ్రోజులు అనుకున్న పవన్ పర్యటన రెండ్రోజులకే ముగించుకుని హస్తిన నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం కావాల్సి వచ్చిందట.

వాస్తవానికి బీజేపీ-జనసేన మధ్య చాలా గ్యాప్ వచ్చిందన్న విషయం జగమెరిగిన సత్యమే. దీంతో ఆ గ్యాప్‌తో అలానే బయటికి వచ్చేయాలా లేకుంటే కమలనాథులతో కలిసి అడుగులు ముందుకేయాలా అనేది పవన్ మదిలో ఎన్నోరోజులుగా మెదులుతున్న ప్రశ్న. ఢిల్లీ పర్యటనతో ఈ ప్రశ్నకు సమాధానం వస్తుందని పవన్ భావించారు కానీ.. అదేమీ జరగలేదట. దీంతో పొత్తులపై ఎటూ లెక్కలే తేలనట్లయ్యింది. దీంతో షా.. సేనానికి షాకిచ్చారని సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. జేపీ నడ్డాతో భేటీతో అయినా పొత్తులపై క్లారిటీ వస్తుందనుకుంటే.. లెక్కలు ఎటూ తేలలేదు. ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ.. మరికొన్ని చర్చల తర్వాతే పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తానని పవన్ పేర్కొన్నారు.

Pawan-modi-and-amith-Shah.jpg

రెండ్రోజుల పాటు ఢిల్లీలో ఏం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పలు కీలక అంశాలపై కేంద్ర నాయకత్వంతో పవన్ చర్చించారని జనసేన అధికారిక ప్రకటనలో పేర్కొంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన మంగళవారం రాత్రి ముగిసింది. సోమ, మంగళ వారాల్లో బీజేపీ ముఖ్య నేతలతో కీలక భేటీలు సాగాయి. మంగళవారం రాత్రి జేపీ నడ్డా నివాసంలో కలిశారు. సుమారు 45 నిమిషాల సాగిన ఈ సమావేశంలో పవన్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిణామాలపై చర్చించారు. పాలన సంబంధితమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవైన పరిస్థితిని, అవినీతి తదితర విషయాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు జనసేన తెలిపింది. ఏపీని వైసీపీ పాలన నుంచి విముక్తం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు జరిగాయని జనసేన చెబుతోంది.

పోలవరం గురించి..!

మొదట.. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మురళీధరన్‌తో రెండు దఫాలుగా పవన్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీతో కూడా పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయాలు, ప్రధాన ప్రాజెక్టుల గురించి పవన్ కేంద్ర నాయకత్వానికి తెలియచేశారు. ఇందులో భాగంగా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసి, ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని కేంద్ర మంత్రి దృష్టికి పవన్ తీసుకువెళ్లారు.

Pawan-with-modi-and-Shah.jpg

పవన్ కామెంట్స్ ఇవీ..

వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశ్ కోసమే పనిచేస్తాను. ఈ చర్చలు ఇప్పుడే ముగియలేదు. మరికొన్ని చర్చల తర్వాతే సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తాను. చట్టబద్దమైన విధానాలు రాష్ట్రంలో అమలుకావడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న గొడవలపై లోతుగా చర్చలు జరిపాం. అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ఎలా వెళ్లాలనేదానిపైనే అన్నికోణాల్లో సమాలోచనలు జరుపుతున్నాం. వైసీపీ వ్యతిరేక ఓటు చిలవద్దనేదానిదే నా అభిమతంఅని ఢిల్లీ వేదికగా పవన్ చెప్పుకొచ్చారు.

Pawan-Delhi-Tour.jpg

మొత్తానికి చూస్తే.. పవన్ ఢిల్లీ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతాయని అభిమానులు అనుకున్నారు కానీ అవేమీ జరగకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్నారట. ఢిల్లీ వేదికగా పవన్ చెప్పాల్సినవన్నీ చెప్పారు. త్వరలోనే మళ్లీ ఢిల్లీ వెళ్తారా లేకుంటే.. ఇంతటితో హస్తిన టూర్‌లు ముగిసినట్లేనా.. వెళ్లాల్సిన అసరం ఉందా లేదా.. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

Pawan Delhi Tour : పవన్ స్వయంగా ఢిల్లీకెళ్లారా.. కమలనాథులే పిలిపించుకున్నారా.. పర్యటన ఒక్కటే.. ప్రశ్నలెన్నో.. కొసమెరుపు ఏమిటంటే..!

*****************************

YS Jagan : ఎక్సర్‌సైజ్ చేస్తుండగా వైఎస్ జగన్ కాలికి గాయం.. ఆందోళనలో వైసీపీ శ్రేణులు.. సడన్‌గా ఒంటిమిట్ట పర్యటన రద్దు..

*****************************

Updated Date - 2023-04-04T23:18:15+05:30 IST