TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన 'మన వారసత్వ సంపద' విజయవంతం

ABN , First Publish Date - 2023-08-02T07:33:13+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థ సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” నెల నెలా తెలుగు వెలుగులో భాగంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో జులై 30న (ఆదివారం) నిర్వహించిన ఎందరో మహానుభావుల వారసులు పాల్గొన్న “మన వారసత్వ సంపద” అనే సాహిత్య సమావేశం విజయవంతంగా ముగిసింది.

TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన 'మన వారసత్వ సంపద' విజయవంతం

డాలస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థ సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” నెల నెలా తెలుగు వెలుగులో భాగంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో జులై 30న (ఆదివారం) నిర్వహించిన ఎందరో మహానుభావుల వారసులు పాల్గొన్న “మన వారసత్వ సంపద” అనే సాహిత్య సమావేశం విజయవంతంగా ముగిసింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఇంతమంది పండితుల వారసులను ఒకే వేదిక మీద సమకూర్చడం తానా చరిత్రలో ఒక మైలురాయి అని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథులందరికీ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా విభిన్న సాహిత్యఅంశాల మీద అంతర్జాలంలో జరుపుకుంటున్న ఈ 57వ సమావేశం ఎంతో విశిష్టమైనదని, కట్టడాలు, పట్టణాలు కూలిపోవచ్చు గాని వీరు సృష్టించిన సాహిత్యం అజరామరం అని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో మన తెలుగు భాషా సాహిత్యాలను తమ కలాలతో, గళాలతో సుసంపన్నం చేసిన ఎంతో మంది కవుల, పండితుల తరతరాల వారసులు పాల్గొంటున్న ఇదొక అపూర్వ సమ్మేళనం. ఇది కేవలం వారు తమ వారసుల కోసం మిగిల్చిన సంపద గాదని, ఇది తెలుగు జాతి సంపద అని, వారు సృష్టించిన సాహిత్యాన్ని భద్రపరచి, భావితరాలకు అందించవలసిన బాధ్యత మన అందరిదీ. మహాకవి తిక్కన, మహాకవి ఎర్రాప్రగడ, కంచెర్ల గోపన్న, కొప్పరపు సోదర కవులు, మహాకవి పోతన, మహాకవి శ్రీనాథుడు, పరవస్తు చిన్నయసూరి మరియు వేంకట, పార్వతీశ్వర జంట కవులకు ఈ వేదికమీద వారి వారసుల మధ్య పుష్పాంజలి ఘటించే అవకాశం కలగడం తమ అదృష్టం” అని చెప్పుకొచ్చారు.

విశిష్ట అతిథులుగా పాల్గొన్న.. తలుపూరు వెంకట రామకృష్ణ, మహాకవి తిక్కన 19వ తరం వంశీయులు- గుడ్లూరు వెంకట పద్మనాభరావు, మహాకవి ఎర్రాప్రగడ 9వ తరం వారసులు- ఎర్రాప్రగడ రామకృష్ణ, ప్రముఖ రచయిత, కంచర్ల శ్రీనివాసరావు, కంచెర్ల గోపన్న (భద్రాచల భక్తరామదాసు) 10వ తరం వారసులు; మా శర్మ, కొప్పరపు కవుల మనుమడు, ప్రముఖ పాత్రికేయులు, కొప్పరపు కళాపీటం వ్యవస్థాపకులు; నెల్లుట్ల రమాదేవి, మహాకవి పోతన 10వ తరం వంశీయులు, ప్రముఖ రచయిత్రి; డా. కావూరి శ్రీనివాస్ శర్మ, శ్రీనాథ మహాకవి వంశీకుడు, ప్రముఖ కవి, శాసన, చారిత్రిక పరిశోధకుడు; డా. వోలేటి పార్వతీశం, వేంకట పార్వతీశ్వరకవుల పౌత్రుడు, వచనకవి, గేయకవి; శ్రీ పరవస్తు ఫణిశయన సూరి, పరవస్తు చిన్నయసూరి 5వ తరం వారసులు పాల్గొని వారి వారి పాండిత్య వైభవాలను మాహాద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సాహిత్యసభలో పాల్గొని విజయవంతంచేసిన అతిథులకు, ప్రసారం చేసిన మాధ్యమాలకు, కార్యకర్తలకు, తానా సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసింది. నాలున్నర గంటలకు పైగా సాగిన పూర్తికార్యక్రమాన్ని ఈ క్రింది లంకెలలో వీక్షించవచ్చును, మీ బంధుమిత్రులతో కూడా పంచుకోవచ్చును.

TANA.jpg

Updated Date - 2023-08-02T07:52:40+05:30 IST