NRI: సైకిల్‌పై ప్రపంచ యాత్ర.. తెలుగు యువకుడికి సింగపూర్ తెలుగు సమాజం సంఘీభావం

ABN , First Publish Date - 2023-09-01T09:22:54+05:30 IST

కరోనాతో కళ్లెదుటే తన తండ్రి, ఇంకా ఎంతో మంది చనిపోవడం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన రంజిత్‌ని కదిలించింది. కాలుష్యం మానవ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి, ప్రజల్ని సులువుగా కరోనా, ఇతర అనారోగాల బారిన పడేటట్లు చేస్తుందని తెలుసుకున్నాడు.

NRI: సైకిల్‌పై ప్రపంచ యాత్ర.. తెలుగు యువకుడికి సింగపూర్ తెలుగు సమాజం సంఘీభావం

NRI: కరోనాతో కళ్లెదుటే తన తండ్రి, ఇంకా ఎంతో మంది చనిపోవడం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన రంజిత్‌ని కదిలించింది. కాలుష్యం మానవ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి, ప్రజల్ని సులువుగా కరోనా, ఇతర అనారోగాల బారిన పడేటట్లు చేస్తుందని తెలుసుకున్నాడు. అందుకే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంగా, శారీరక దృఢత్వం కలిగి ఉండాలన్న ఆలోచనని కలిగించాలనే లక్ష్యంతో యాత్ర ప్రారంభించాడు. దాని కోసం కాలుష్యం కలిగించని, శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని అందించే సైక్లింగ్ చేయ్యాలని ధృడ సంకల్పతో రంజిత్ అడుగులు వేసాడు. 2021 ఏప్రిల్ 5న మొదలైన 'రంజిత్ ఆన్ వీల్స్' సైక్లింగ్ యాత్ర భారతదేశం దాటి.. ఆసియా ఖండంలోని వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా దేశాలను చుట్టి.. ఆగస్టు 29న సింగపూర్ చేరింది. మంచి సంకల్పంతో రంజిత్ చేస్తున్న ఈ యాత్రకి సింగపూర్ తెలుగు సమాజం సంఘీభావం తెలిపింది. రంజిత్ చేస్తున్న కృషిని కమిటీ అభినందించింది.

ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటని అన్నారు. దీనివల్ల మానవాళి రోగనిరోధక సన్నగిల్లితుందని, మనమంతా కనీసం వారంలో ఒక్కరోజైనా సైక్లింగ్ చెయ్యాలని తెలిపారు. దానివల్ల పర్యావరణం మెరుగుపడటంతో పాటు మనమంతా శారీరకంగా దృఢంగా ఉంటామని చెప్పారు. అందరూ రంజిత్ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నామని తెలిపారు. తరవాత కమిటీ సభ్యులు రంజిత్‌ను సత్కరించారు. తన ప్రపంచ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రంజిత్ మాట్లాడుతూ.. సింగపూర్ దేశం చాలా బాగుందన్నారు. ఇక్కడ పచ్చని చెట్లు అధికంగా ఉండటం, ప్రజలందరూ మెట్రో రైలు, సిటీ బస్ లాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడటం మంచి విషయం అని పేర్కొన్నారు. అలాగే చాలా చోట్ల సైకిల్ వాడటం గమనించానని తెలిపారు. దీని కారణంగా కాలుష్యానికి అవకాశం తక్కువగా ఉందని అన్నారు. తెలుగు సమాజం వారిచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు.

STS.jpg

రంజిత్ రెండు రోజులలో సింగపూర్ నుండి ఇండోనేసియాలోని జకార్తాకు, తరువాత ఫిలిప్పైన్స్, ఇతర దేశాల గుండా ఆస్ట్రేలియా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. 2021 ఏప్రిల్ 5 నుండి ఇప్పటివరకు 22,300 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. 'రంజిత్ ఆన్ వీల్స్' ఫేస్‌బుక్ పేజీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దాదాపు 3 లక్షల 60 వేల మంది ఫాలోవర్స్ ఉన్న రంజిత్ నిత్యం వారికి తన ప్రయాణంలో విశేషాల్ని పంచుకుంటున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అన్నారు- కాలుష్యం తమ తమ పరిధిలో నియంత్రిస్తూ, తగిన శారీరక శ్రమ చేయడం ద్వారా తప్పకుండా తన కోరిక నెరవేరుతుంది.

Updated Date - 2023-09-01T09:22:54+05:30 IST